మత్తయి సువార్త
17 ఆరు రోజుల తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును మాత్రమే తీసుకొని ఎత్తైన ఒక కొండ మీదికి వెళ్లాడు.+ 2 అక్కడ వాళ్లముందు యేసు రూపం మారిపోయింది;* ఆయన ముఖం సూర్యునిలా ప్రకాశించింది, ఆయన పైవస్త్రాలు వెలుగులా తెల్లగా అయ్యాయి.+ 3 ఇదిగో! మోషే, ఏలీయా ఆయనతో మాట్లాడడం వాళ్లకు కనిపించింది. 4 అప్పుడు పేతురు యేసుతో, “ప్రభువా, మనం ఇక్కడ ఉంటే బాగుంటుంది. నీకు ఇష్టమైతే ఇక్కడ మూడు డేరాలు వేస్తాను. ఒకటి నీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలీయాకు” అన్నాడు. 5 అతను ఇంకా మాట్లాడుతుండగా, ఇదిగో! ఒక ప్రకాశవంతమైన మేఘం వాళ్లను కమ్ముకుంది; అప్పుడు ఇదిగో! ఆ మేఘంలో నుండి ఒక స్వరం, “ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన్ని చూసి నేను సంతోషిస్తున్నాను.*+ ఈయన మాట వినండి”+ అని చెప్పింది. 6 అది విన్నప్పుడు శిష్యులు ఎంతో భయపడి నేలమీద సాష్టాంగపడ్డారు. 7 యేసు వాళ్ల దగ్గరికి వచ్చి వాళ్లను ముట్టుకొని, “లేవండి, భయపడకండి” అన్నాడు. 8 వాళ్లు తలెత్తి చూసినప్పుడు, అక్కడ యేసు తప్ప ఇంకెవ్వరూ వాళ్లకు కనిపించలేదు. 9 వాళ్లు కొండ దిగి వస్తుండగా యేసు, “మానవ కుమారుడు మృతుల్లో నుండి బ్రతికించబడేంత వరకు ఈ దర్శనం గురించి ఎవ్వరికీ చెప్పొద్దు” అని వాళ్లకు ఆజ్ఞాపించాడు.+
10 అయితే శిష్యులు, “అలాగైతే, ముందు ఏలీయా రావాలని శాస్త్రులు ఎందుకు అంటున్నారు?” అని ఆయన్ని అడిగారు. 11 అందుకు ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “నిజంగానే, ఏలీయా ముందుగా వచ్చి అన్నిటినీ చక్కబెడతాడు.+ 12 అయితే నేను మీతో చెప్తున్నాను, ఏలీయా ఇదివరకే వచ్చాడు; కానీ వాళ్లు అతన్ని గుర్తించకుండా తమకు ఇష్టమొచ్చినట్టు అతనితో ప్రవర్తించారు. మానవ కుమారుడు కూడా అదేవిధంగా వాళ్ల చేతుల్లో బాధలు అనుభవిస్తాడు.”+ 13 యేసు తమతో మాట్లాడింది బాప్తిస్మమిచ్చే యోహాను గురించని శిష్యులకు అప్పుడు అర్థమైంది.
14 వాళ్లు ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు,+ ఒకతను వచ్చి యేసు ముందు మోకరించి ఇలా అన్నాడు: 15 “ప్రభువా, మా అబ్బాయి మీద కరుణ చూపించు; అతని ఆరోగ్యం బాలేదు, మూర్ఛరోగం ఉంది. అతను తరచూ మంటల్లో, నీళ్లలో పడుతుంటాడు.+ 16 అతన్ని నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను కానీ వాళ్లు బాగుచేయలేకపోయారు.” 17 అప్పుడు యేసు, “విశ్వాసంలేని చెడ్డ* తరమా,+ ఎంతకాలం నేను మీతో ఉండాలి? ఎంతకాలం మిమ్మల్ని సహించాలి? ఆ అబ్బాయిని నా దగ్గరికి తీసుకురండి” అన్నాడు. 18 అప్పుడు యేసు ఆ చెడ్డదూతను* గద్దించాడు, దాంతో ఆ చెడ్డదూత అతనిలో నుండి బయటికి వచ్చాడు, అతను వెంటనే బాగయ్యాడు.+ 19 తర్వాత శిష్యులు ఒంటరిగా యేసు దగ్గరికి వచ్చి, “ఆ చెడ్డదూతను మేము ఎందుకు వెళ్లగొట్టలేకపోయాం?” అని అడిగారు. 20 దానికి యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “మీ అల్పవిశ్వాసం వల్లే. నేను మీతో నిజంగా చెప్తున్నాను, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండి, ఈ కొండతో, ‘ఇక్కడి నుండి అక్కడికి వెళ్లు’ అని అంటే, అది వెళ్తుంది; మీకు ఏదీ అసాధ్యంగా ఉండదు.”+ 21 *——
22 వాళ్లు గలిలయలో కలుసుకున్నప్పుడు యేసు తన శిష్యులతో ఇలా చెప్పాడు: “మానవ కుమారుడు శత్రువుల చేతికి అప్పగించబడబోతున్నాడు,+ 23 వాళ్లు ఆయన్ని చంపుతారు, కానీ మూడో రోజున ఆయన బ్రతికించబడతాడు.”+ అది విని వాళ్లు చాలా దుఃఖపడ్డారు.
24 వాళ్లు కపెర్నహూముకు వచ్చాక, ఆలయ పన్ను* వసూలుచేసే వాళ్లు వచ్చి, “మీ బోధకుడు ఆలయ పన్ను కట్టడా?” అని పేతురును అడిగారు.+ 25 దానికి పేతురు, “కడతాడు” అని చెప్పాడు. పేతురు ఇంట్లోకి వచ్చినప్పుడు యేసే ముందుగా మాట్లాడాడు, ఆయన “సీమోనూ, నీకేమనిపిస్తుంది? భూరాజులు సుంకాలు, పన్ను* ఎవరి దగ్గర వసూలు చేస్తారు? తమ పిల్లల దగ్గరా? బయటివాళ్ల దగ్గరా?” అని అతన్ని అడిగాడు. 26 పేతురు, “బయటివాళ్ల దగ్గరే” అన్నాడు. అప్పుడు యేసు అతనితో ఇలా అన్నాడు: “అలాగైతే పిల్లలు పన్ను కట్టాల్సిన అవసరం లేదు. 27 కానీ మనం వాళ్లకు అభ్యంతరం కలిగించకుండా ఉండేలా,+ నువ్వు సముద్రం దగ్గరికి వెళ్లి గాలం వేసి మొదట చిక్కే చేపను తీసుకో, దాని నోరు తెరిస్తే ఒక వెండి నాణెం* కనిపిస్తుంది, దాన్ని తీసుకెళ్లి మనిద్దరి కోసం పన్ను కట్టు.”