మత్తయి సువార్త
13 యేసు ఆ రోజు ఆ ఇంటి నుండి వెళ్లి, సముద్రం ఒడ్డున కూర్చొని ఉన్నాడు. 2 అప్పుడు చాలామంది ప్రజలు ఆయన దగ్గరికి రావడంతో ఆయన ఒక పడవ ఎక్కి అందులో కూర్చున్నాడు. ప్రజలందరూ ఒడ్డున నిలబడివున్నారు. 3 అప్పుడు యేసు ఉదాహరణలతో* వాళ్లకు చాలా విషయాలు బోధించాడు.+ ఆయనిలా చెప్పాడు: “ఇదిగో! ఒకతను విత్తనాలు చల్లడానికి బయల్దేరాడు.+ 4 అతను విత్తనాలు చల్లుతుండగా, కొన్ని విత్తనాలు దారి పక్కన పడ్డాయి; పక్షులు వచ్చి వాటిని తినేశాయి.+ 5 ఇంకొన్ని విత్తనాలు అంతగా మట్టి లేని రాతినేల మీద పడ్డాయి, మట్టి ఎక్కువ లోతు లేనందువల్ల అవి వెంటనే మొలకెత్తాయి.+ 6 అయితే ఎండ వచ్చినప్పుడు అవి ఎండిపోయాయి, వేరు లేనందువల్ల వాడిపోయాయి. 7 మరికొన్ని విత్తనాలు ముళ్లపొదల్లో పడ్డాయి, ముళ్లపొదలు పెరిగి వాటి ఎదుగుదలను అడ్డుకున్నాయి.+ 8 అయితే కొన్ని మాత్రం మంచినేల మీద పడ్డాయి. వాటిలో కొన్ని విత్తనాలు 100 రెట్లు, ఇంకొన్ని 60 రెట్లు, మరికొన్ని 30 రెట్లు ఎక్కువగా ఫలించడం మొదలుపెట్టాయి.+ 9 చెవులు ఉన్నవాడు వినాలి.”+
10 తర్వాత శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “నువ్వు వాళ్లకు ఉదాహరణలతో ఎందుకు బోధిస్తున్నావు?” అని అడిగారు.+ 11 అప్పుడు యేసు ఇలా చెప్పాడు: “పరలోక రాజ్యం గురించిన పవిత్ర రహస్యాల్ని అర్థం చేసుకునే అవకాశాన్ని దేవుడు మీకు ఇచ్చాడు+ కానీ వాళ్లకు ఇవ్వలేదు. 12 ఎందుకంటే ఎవరి దగ్గర ఉందో, వాళ్లు ఇంకా ఎక్కువ పొందుతారు. అలా వాళ్ల దగ్గర సమృద్ధిగా ఉంటుంది. అయితే ఎవరి దగ్గరైతే లేదో, వాళ్ల దగ్గర ఉన్నది కూడా వాళ్ల నుండి తీసేయబడుతుంది.+ 13 అందుకే నేను వాళ్లకు ఉదాహరణలతో బోధిస్తున్నాను; ఎందుకంటే వాళ్లు చూస్తారు గానీ వాళ్లకేమీ కనిపించదు, వింటారు గానీ ఏమీ వినిపించదు, విన్న విషయాన్ని అర్థం చేసుకోరు.+ 14 యెషయా చెప్పిన ఈ ప్రవచనం వాళ్ల విషయంలో నెరవేరుతోంది: ‘మీరు వినడం వరకు వింటారు కానీ మీకు ఏమాత్రం అర్థంకాదు, మీరు చూడడం వరకు చూస్తారు కానీ మీకు ఏమీ కనిపించదు.+ 15 ఈ ప్రజల హృదయాలు మొద్దుబారిపోయాయి. వాళ్లు చెవులతో వింటారు కానీ స్పందించరు. వాళ్లు తమ కళ్లు మూసుకున్నారు. వాళ్లు తమ కళ్లతో చూడడానికి, చెవులతో వినడానికి ఇష్టపడట్లేదు; తమ హృదయాలతో అర్థంచేసుకొని నా వైపుకు తిరగడానికి నిరాకరిస్తున్నారు. నేను వాళ్లను బాగుచేయకుండా ఉండాలని అలా చేస్తున్నారు.’+
16 “అయితే మీరు ఈ విషయాల్ని చూస్తున్నారు, వింటున్నారు కాబట్టి మీరు ధన్యులు.*+ 17 ఎందుకంటే చాలామంది ప్రవక్తలు, నీతిమంతులు మీరు చూస్తున్నవాటిని చూడాలని కోరుకున్నారు కానీ చూడలేకపోయారు;+ మీరు వింటున్నవాటిని వినాలని కోరుకున్నారు కానీ వినలేకపోయారు అని నేను నిజంగా మీతో చెప్తున్నాను.
18 “ఇప్పుడు విత్తేవాడి ఉదాహరణ అర్థమేంటో వినండి.+ 19 ఎవరైనా రాజ్యం గురించిన వాక్యం విని, దాన్ని అర్థం చేసుకోకపోతే వాళ్ల హృదయంలో నాటబడినదాన్ని దుష్టుడు+ వచ్చి ఎత్తుకెళ్లిపోతాడు. దారిపక్కన నేల లాంటివాళ్లు వీళ్లే.+ 20 రాతినేల లాంటివాళ్లు, వాక్యాన్ని విని, వెంటనే సంతోషంగా దాన్ని అంగీకరిస్తారు.+ 21 అయితే వాక్యం వాళ్లలో వేళ్లూనుకోదు, అయినా వాళ్లు కొంతకాలం కొనసాగుతారు. తర్వాత వాక్యం కారణంగా శ్రమలు గానీ హింసలు గానీ వస్తే వెంటనే విశ్వాసాన్ని వదిలేస్తారు. 22 ముళ్లపొదలు ఉన్న నేల లాంటివాళ్లు, వాక్యాన్ని వింటారు కానీ ఈ వ్యవస్థలో* ఉన్న ఆందోళనలు,+ సిరిసంపదలకున్న మోసకరమైన శక్తి వాక్యాన్ని ఎదగనివ్వవు. దాంతో వాక్యం ఫలించకుండా పోతుంది.+ 23 మంచినేల లాంటివాళ్లు, వాక్యాన్ని విని దాన్ని అర్థం చేసుకుంటారు. వాళ్లు నిజంగా ఫలిస్తారు, వాళ్లలో కొంతమంది 100 రెట్లు, ఇంకొంతమంది 60 రెట్లు, మరికొంతమంది 30 రెట్లు ఎక్కువగా ఫలిస్తారు.”+
24 యేసు ప్రజలకు ఇంకో ఉదాహరణ చెప్పాడు: “పరలోక రాజ్యాన్ని, తన పొలంలో మంచి విత్తనాలు విత్తిన మనిషితో పోల్చవచ్చు. 25 అందరూ నిద్రపోతున్నప్పుడు అతని శత్రువు వచ్చి, గోధుమల మధ్య గురుగులు* నాటి వెళ్లిపోయాడు. 26 మొక్కలు పెరిగి వాటికి గింజలు వచ్చినప్పుడు గురుగులు కూడా కనిపించాయి. 27 కాబట్టి అతని దాసులు వచ్చి, ‘అయ్యా, నువ్వు నీ పొలంలో మంచి విత్తనాలు విత్తావు కదా, మరి గురుగులు ఎక్కడి నుండి వచ్చాయి?’ అని అతన్ని అడిగారు. 28 అతను, ‘ఇది శత్రువు చేసిన పని’ అన్నాడు.+ అప్పుడు ఆ దాసులు, ‘మరి మమ్మల్ని వెళ్లి వాటిని పీకేయమంటావా?’ అని అడిగారు. 29 అందుకు అతను ఇలా చెప్పాడు: ‘వద్దు, మీరు గురుగుల్ని పీకేసేటప్పుడు పొరపాటున గోధుమల్ని కూడా పీకేస్తారేమో. 30 కోతకాలం వరకు రెండిటినీ కలిసి పెరగనివ్వండి; కోతకాలంలో కోత కోసేవాళ్లతో, “ముందు గురుగుల్ని పీకేసి, వాటిని కాల్చడానికి కట్టగట్టండి, తర్వాత గోధుమల్ని నా గోదాములోకి సమకూర్చండి” అని చెప్తాను.’ ”+
31 ఆయన ప్రజలకు ఇంకో ఉదాహరణ చెప్పాడు: “పరలోక రాజ్యం, ఒక మనిషి తన పొలంలో విత్తిన ఆవగింజ లాంటిది.+ 32 అది విత్తనాలన్నిట్లో చాలా చిన్నదే, అయినా అది పెరిగినప్పుడు కూరమొక్కలన్నిటి కన్నా పెద్దదై, ఒక చెట్టు అవుతుంది. ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మల్లో ఆశ్రయం పొందుతాయి.”
33 ఆయన ప్రజలకు ఇంకో ఉదాహరణ చెప్పాడు: “పరలోక రాజ్యం, ఒక స్త్రీ పది కిలోల* పిండిలో కలిపిన పులిసిన పిండి లాంటిది. దానివల్ల పిండి ముద్దంతా పులిసిపోయింది.”+
34 యేసు ఈ విషయాలన్నిటినీ ఉదాహరణలతో ప్రజలకు బోధించాడు. నిజానికి, ఉదాహరణలు ఉపయోగించకుండా ఆయన వాళ్లతో ఏమీ మాట్లాడలేదు.+ 35 అలా, దేవుడు ప్రవక్త ద్వారా చెప్పిన ఈ మాటలు నెరవేరాయి: “నేను నా నోరు తెరిచి ఉదాహరణలతో బోధిస్తాను; ప్రారంభం* నుండి దాచబడిన విషయాల్ని ప్రకటిస్తాను.”+
36 యేసు ప్రజల్ని పంపించేశాక ఇంట్లోకి వెళ్లాడు. అప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “పొలంలోని గురుగుల ఉదాహరణ గురించి మాకు వివరంగా చెప్పు” అని అడిగారు. 37 అప్పుడు యేసు ఇలా చెప్పాడు: “మంచి విత్తనాలు విత్తిన వ్యక్తి మానవ కుమారుడు; 38 పొలం ఈ లోకం.+ మంచి విత్తనాలు రాజ్య కుమారులు; గురుగులు దుష్టుని కుమారులు.+ 39 వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత ఈ వ్యవస్థ* ముగింపు; కోత కోసేవాళ్లు దేవదూతలు. 40 ఎలాగైతే గురుగుల్ని సమకూర్చి అగ్నిలో కాల్చేస్తారో, అలాగే ఈ వ్యవస్థ* ముగింపులో కూడా జరుగుతుంది.+ 41 మానవ కుమారుడు తన దూతల్ని పంపిస్తాడు. ఆ దూతలు ఇతరులు పాపం చేయడానికి కారణమయ్యేవాళ్లను, చెడ్డపనులు చేసేవాళ్లను ఆయన రాజ్యంలో నుండి తొలగించి, 42 మండే కొలిమిలో పడేస్తారు.+ అక్కడ వాళ్లు ఏడుస్తూ, పళ్లు కొరుక్కుంటూ ఉంటారు. 43 ఆ కాలంలో నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యునిలా తేజోవంతంగా ప్రకాశిస్తారు.+ చెవులు ఉన్నవాడు వినాలి.
44 “పరలోక రాజ్యం, పొలంలో దాచబడిన నిధి లాంటిది; ఒకతను దాన్ని కనుగొని, మళ్లీ దాచిపెట్టి, సంతోషంగా వెళ్లి తనకున్నదంతా అమ్మేసి ఆ పొలాన్ని కొన్నాడు.+
45 “అంతేకాదు పరలోక రాజ్యం, మంచి ముత్యాల కోసం వెదుకుతున్న ఒక వ్యాపారి* లాంటిది. 46 అతను ఎంతో విలువైన ఒక ముత్యాన్ని చూసినప్పుడు, వెళ్లి వెంటనే తన దగ్గర ఉన్నవన్నీ అమ్మేసి దాన్ని కొన్నాడు.+
47 “అంతేకాదు పరలోక రాజ్యం, సముద్రంలోకి వేయబడి అన్నిరకాల చేపల్ని పట్టే పెద్ద వల లాంటిది. 48 వల నిండినప్పుడు జాలర్లు దాన్ని ఒడ్డుకు లాగి, కూర్చొని మంచి చేపల్ని+ గంపల్లో వేశారు, పనికిరాని చేపల్ని+ పడేశారు. 49 ఈ వ్యవస్థ* ముగింపులో కూడా అలాగే జరుగుతుంది. దేవదూతలు వచ్చి, నీతిమంతుల మధ్య నుండి దుష్టుల్ని వేరు చేసి 50 మండే కొలిమిలో పడేస్తారు. అక్కడ వాళ్లు ఏడుస్తూ, పళ్లు కొరుక్కుంటూ ఉంటారు.
51 “ఇవన్నీ మీకు అర్థమయ్యాయా?” అని ఆయన అడిగాడు. వాళ్లు, “అర్థమయ్యాయి” అన్నారు. 52 అప్పుడు ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “ఇవన్నీ మీకు అర్థమయ్యాయి కాబట్టి, ‘పరలోక రాజ్యం గురించి నేర్చుకునే* ప్రతీ ఉపదేశకుడు, తన ఖజానాలో నుండి కొత్తవాటినీ, పాతవాటినీ బయటికి తీసే ఇంటి యజమాని లాంటివాడు’ అని తెలుసుకోండి.”
53 ఈ ఉదాహరణలు చెప్పడం పూర్తయ్యాక యేసు అక్కడి నుండి బయల్దేరాడు. 54 ఆయన తన సొంత ఊరికి వచ్చిన తర్వాత,+ అక్కడి సమాజమందిరంలో బోధించడం మొదలుపెట్టాడు. విన్న వాళ్లు ఎంతో ఆశ్చర్యపోయి ఇలా చెప్పుకున్నారు: “ఇతనికి ఈ తెలివి, శక్తివంతమైన పనులు చేసే ఈ సామర్థ్యం ఎక్కడి నుండి వచ్చాయి?+ 55 ఇతను వడ్రంగి కుమారుడే కదా?+ ఇతని తల్లి పేరు మరియే కదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా ఇతని తమ్ముళ్లే కదా?+ 56 ఇతని చెల్లెళ్లంతా మనతోనే ఉన్నారు కదా? మరి ఇతనికి ఈ సామర్థ్యమంతా ఎక్కడి నుండి వచ్చింది?”+ 57 అలా వాళ్లు ఆయన మీద విశ్వాసం ఉంచలేదు.+ కాబట్టి యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “ఒక ప్రవక్తను సొంత ఊరివాళ్లు, ఇంటివాళ్లు తప్ప అందరూ గౌరవిస్తారు.”+ 58 వాళ్లకు విశ్వాసం లేకపోవడంతో, యేసు అక్కడ ఎక్కువ అద్భుతాలు చేయలేదు.