మార్కు సువార్త
9 యేసు వాళ్లతో ఇంకా ఇలా అన్నాడు: “నేను నిజంగా మీతో చెప్తున్నాను, ఇక్కడ ఉన్నవాళ్లలో కొంతమంది దేవుని రాజ్యం గొప్ప శక్తితో రావడం చూసేవరకు చనిపోరు.”+ 2 ఆరు రోజుల తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రమే తీసుకొని ఎత్తైన ఒక కొండ మీదికి వెళ్లాడు. అక్కడ వాళ్ల ముందు యేసు రూపం మారిపోయింది.*+ 3 ఆయన పైవస్త్రాలు భూమ్మీద ఏ చాకలీ ఉతకలేనంత తెల్లగా అయ్యి తళతళ మెరుస్తున్నాయి. 4 అక్కడ మోషే, ఏలీయా కూడా వాళ్లకు కనిపించారు, వాళ్లిద్దరు యేసుతో మాట్లాడుతున్నారు. 5 అప్పుడు పేతురు యేసుతో, “రబ్బీ, మనం ఇక్కడ ఉంటే బాగుంటుంది. కాబట్టి మమ్మల్ని మూడు డేరాలు వేయనివ్వు. ఒకటి నీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలీయాకు” అన్నాడు. 6 నిజానికి పేతురుకు ఏమి మాట్లాడాలో తోచలేదు, ఎందుకంటే వాళ్లకు చాలా భయమేసింది. 7 అప్పుడు ఒక మేఘం ఏర్పడి వాళ్లను కమ్మేసింది, ఆ మేఘంలో నుండి ఒక స్వరం+ ఇలా వినిపించింది: “ఈయన నా ప్రియ కుమారుడు.+ ఈయన మాట వినండి.”+ 8 వెంటనే వాళ్లు చుట్టూ చూశారు, అక్కడ యేసు తప్ప ఇంకెవ్వరూ వాళ్లకు కనిపించలేదు.
9 వాళ్లు కొండ దిగి వస్తుండగా యేసు, మానవ కుమారుడు మృతుల్లో నుండి బ్రతికేంత వరకు తాము చూసినదాని గురించి ఎవ్వరికీ చెప్పొద్దని వాళ్లకు గట్టిగా ఆజ్ఞాపించాడు.+ 10 వాళ్లు ఆయన మాటను గంభీరంగా తీసుకున్నారు,* కానీ ఆయన మృతుల్లో నుండి బ్రతకడమంటే ఏమిటనే దాని గురించి వాళ్లలోవాళ్లు మాట్లాడుకున్నారు. 11 తర్వాత వాళ్లు, “ముందు ఏలీయా రావాలని శాస్త్రులు ఎందుకు అంటున్నారు?”+ అని ఆయన్ని అడిగారు. 12 అందుకు ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “నిజమే, ఏలీయా ముందుగానే వచ్చి అన్నిటినీ చక్కబెడతాడు; అయితే మానవ కుమారుడు ఎన్నో బాధలు పడాలని,+ తిరస్కారానికి గురవ్వాలని+ ఎందుకు రాయబడింది? 13 నేను మీతో చెప్తున్నాను, నిజానికి ఏలీయా+ వచ్చాడు. అతని గురించి రాయబడినట్టుగానే వాళ్లు అతనితో తమకు ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించారు.”+
14 యేసు, ఆ ముగ్గురు శిష్యులు కలిసి మిగతా శిష్యుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ల చుట్టూ చాలామంది ప్రజలు ఉన్నారు, శాస్త్రులు వాళ్లతో వాదిస్తున్నారు.+ 15 కానీ యేసు కనబడగానే ఆ ప్రజలంతా ఆశ్చర్యపోయి, పరుగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వచ్చి నమస్కారం చేశారు. 16 యేసు, “మీరు దేని గురించి వాళ్లతో వాదిస్తున్నారు?” అని అడిగాడు. 17 అప్పుడు వాళ్లలో ఒకతను ఇలా చెప్పాడు: “బోధకుడా, మా అబ్బాయికి మూగ దూత* పట్టాడు. అందుకే అతన్ని నీ దగ్గరికి తీసుకొచ్చాను.+ 18 ఆ చెడ్డదూత పట్టినప్పుడల్లా అతను కింద పడిపోతాడు, అతని నోట్లో నుండి నురగ వస్తుంది, పళ్లు కొరుక్కుంటాడు, నీరసించిపోతాడు. ఆ చెడ్డదూతను వెళ్లగొట్టమని నీ శిష్యుల్ని అడిగాను కానీ వాళ్ల వల్ల కాలేదు.” 19 అప్పుడు యేసు వాళ్లతో, “విశ్వాసంలేని తరమా,+ ఎంతకాలం నేను మీతో ఉండాలి? ఎంతకాలం మిమ్మల్ని సహించాలి? ఆ అబ్బాయిని నా దగ్గరికి తీసుకురండి” అన్నాడు.+ 20 వాళ్లు ఆ అబ్బాయిని యేసు దగ్గరికి తీసుకొచ్చారు, కానీ ఆ చెడ్డదూత యేసును చూడగానే ఆ అబ్బాయిని గిలగిలా కొట్టుకునేలా చేశాడు. అతను కిందపడి అటూఇటూ దొర్లుతూ ఉన్నాడు, అతని నోట్లో నుండి నురగ వస్తూ ఉంది. 21 అప్పుడు యేసు, “అతనికి ఎంతకాలంగా ఇలా జరుగుతోంది?” అని వాళ్ల నాన్నను అడిగాడు. అతను ఇలా చెప్పాడు: “చిన్నప్పటి నుండీ ఇలాగే జరుగుతోంది. 22 చెడ్డదూత అతన్ని చంపేయాలని తరచూ మంటల్లోకి, నీళ్లలోకి తోసేస్తాడు. నువ్వు ఏమైనా చేయగలిగితే, మామీద జాలి చూపించి మాకు సహాయం చేయి.” 23 అప్పుడు యేసు అతనితో, “ ‘చేయగలిగితే’ అనే మాట ఎందుకు? విశ్వాసం ఉన్న వ్యక్తికి అన్నీ సాధ్యమే”+ అని చెప్పాడు. 24 వెంటనే అతను గట్టిగా, “నాకు విశ్వాసం ఉంది! ఒకవేళ విశ్వాసం తక్కువగా ఉంటే సహాయం చేయి”+ అన్నాడు.
25 ప్రజలు తమవైపు పరుగెత్తుకురావడం గమనించి, యేసు ఆ అపవిత్ర దూతను* గద్దిస్తూ, “చెవుడున్న మూగ దూతా, నీకు ఆజ్ఞాపిస్తున్నాను, బయటికి రా. ఇంకెప్పుడూ అతనిలోకి ప్రవేశించకు!” అన్నాడు.+ 26 ఆ అపవిత్ర దూత గట్టిగా అరిచి, ఆ అబ్బాయిని గిలగిల కొట్టుకునేలా చేసి అతనిలో నుండి బయటికి వచ్చేశాడు. అప్పుడు ఆ అబ్బాయి చనిపోయినవాడిలా పడివున్నాడు. దాంతో చాలామంది, “ఈ అబ్బాయి చనిపోయాడు!” అన్నారు. 27 అయితే యేసు ఆ అబ్బాయి చెయ్యి పట్టుకొని పైకి లేపాడు, అతను లేచి నిలబడ్డాడు. 28 ఆ తర్వాత యేసు ఒక ఇంట్లోకి వెళ్లాడు. యేసు ఒక్కడే ఉన్నప్పుడు శిష్యులు ఆయన్ని, “ఆ చెడ్డదూతను మేము ఎందుకు వెళ్లగొట్టలేకపోయాం?” అని అడిగారు.+ 29 అందుకు యేసు, “ఇలాంటి చెడ్డదూతల్ని వెళ్లగొట్టడం ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యమౌతుంది” అని చెప్పాడు.
30 వాళ్లు అక్కడి నుండి బయల్దేరి గలిలయ గుండా ప్రయాణించారు. అయితే యేసు ఆ విషయం గురించి ఎవ్వరికీ తెలియకూడదని అనుకున్నాడు. 31 ఆయన తన శిష్యులకు బోధిస్తూ, “మానవ కుమారుడు శత్రువుల చేతికి అప్పగించబడబోతున్నాడు, వాళ్లు ఆయన్ని చంపుతారు.+ అయితే ఆయన చనిపోయినా, మూడు రోజుల తర్వాత మళ్లీ బ్రతుకుతాడు”+ అని చెప్తూ ఉన్నాడు. 32 ఆయన మాటలు వాళ్లకు అర్థంకాలేదు, కానీ దాని గురించి ఆయన్ని అడగడానికి వాళ్లు భయపడ్డారు.
33 వాళ్లు కపెర్నహూముకు చేరుకున్నారు. ఇంటికి వచ్చాక యేసు వాళ్లను, “దారిలో మీరు దేని గురించి వాదించుకుంటున్నారు?”+ అని అడిగాడు. 34 అయితే వాళ్లు మౌనంగా ఉండిపోయారు, ఎందుకంటే దారిలో వాళ్లు తమలో ఎవరు గొప్ప అని వాదించుకున్నారు. 35 అప్పుడు ఆయన కూర్చొని ఆ పన్నెండుమందిని పిలిచి, “ఎవరైనా అందరికంటే ముందు ఉండాలని అనుకుంటే, అతను అందరికంటే చివర్లో ఉండాలి, అందరికీ సేవ చేయాలి”+ అని చెప్పాడు. 36 తర్వాత ఆయన ఒక చిన్న బాబును వాళ్ల మధ్య నిలబెట్టి, అతని భుజాల చుట్టూ చేతులేసి వాళ్లతో ఇలా అన్నాడు: 37 “నా పేరున ఇలాంటి చిన్నపిల్లల్లో ఒకర్ని చేర్చుకునే వ్యక్తి+ నన్ను కూడా చేర్చుకుంటున్నాడు. నన్ను చేర్చుకునే వ్యక్తి, నన్నే కాదు నన్ను పంపిన దేవుణ్ణి కూడా చేర్చుకుంటున్నాడు.”+
38 యోహాను యేసుతో ఇలా అన్నాడు: “బోధకుడా, ఒకతను నీ పేరున చెడ్డదూతల్ని వెళ్లగొడుతుండడం మేము చూశాం; అతను మనలో ఒకడు కాదు కాబట్టి మేము అతన్ని ఆపడానికి ప్రయత్నించాం.”+ 39 కానీ యేసు ఇలా అన్నాడు: “అతన్ని ఆపడానికి ప్రయత్నించొద్దు. ఎందుకంటే నా పేరున అద్భుతాలు చేసేవాళ్లెవ్వరూ అంత త్వరగా నా గురించి చెడ్డగా మాట్లాడలేరు. 40 మనకు వ్యతిరేకంగా లేని వ్యక్తి మన వైపే ఉన్నాడు.+ 41 నేను నిజంగా మీతో చెప్తున్నాను, మీరు క్రీస్తు శిష్యులని మీకు గిన్నెడు నీళ్లు ఇచ్చేవాళ్లు+ ఎవరైనా సరే తప్పకుండా ప్రతిఫలం పొందుతారు. 42 విశ్వాసంగల ఈ చిన్నవాళ్లలో ఒకరు విశ్వాసం కోల్పోవడానికి* ఎవరైతే కారణమౌతారో, అతను మెడకు పెద్ద తిరుగలి రాయి కట్టబడి సముద్రంలో పడేయబడడమే అతనికి మంచిది.+
43 “నీ చెయ్యి నీతో పాపం చేయిస్తుంటే* దాన్ని నరికేయి. ఆర్పలేని మంటలు గల గెహెన్నాలోకి* రెండు చేతులతో వెళ్లడం కన్నా ఒక్క చెయ్యితో జీవాన్ని పొందడం నీకు మంచిది.+ 44 *—— 45 నీ కాలు నీతో పాపం చేయిస్తుంటే దాన్ని నరికేయి. రెండు కాళ్లతో గెహెన్నాలో*+ పడేయబడడం కన్నా ఒక్క కాలుతో జీవాన్ని పొందడం నీకు మంచిది. 46 *—— 47 నీ కన్ను నీతో పాపం చేయిస్తుంటే, దాన్ని తీసిపారేయి.+ రెండు కళ్లతో గెహెన్నాలో* పడేయబడడం కన్నా ఒక్క కన్నుతో దేవుని రాజ్యంలో ప్రవేశించడం నీకు మంచిది.+ 48 అక్కడ* పురుగు చావదు, అగ్ని ఆరదు.+
49 “ఉప్పు చల్లినట్టుగా ప్రతీ ఒక్కరి మీద అగ్ని కురిపించబడాలి.+ 50 ఉప్పు చాలా మంచిది, కానీ అది దాని రుచి* కోల్పోతే, దానికి మళ్లీ ఉప్పదనం ఎలా వస్తుంది?+ మీరు ఉప్పులా ఉండండి,+ ఒకరితో ఒకరు శాంతిగా మెలగండి.”+