మత్తయి సువార్త
26 ఇవన్నీ చెప్పడం అయిపోయాక యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు: 2 “ఇక రెండు రోజుల్లో పస్కా పండుగ వస్తుందని,+ మానవ కుమారుణ్ణి కొయ్య మీద శిక్షించడానికి ఆయన్ని శత్రువుల చేతికి అప్పగిస్తారని మీకు తెలుసు.”+
3 ఆ సమయంలో ముఖ్య యాజకులు, ప్రజల పెద్దలు ప్రధానయాజకుడైన కయప+ ఇంటి ప్రాంగణంలో సమావేశమయ్యారు. 4 వాళ్లంతా కలిసి+ యేసును కుయుక్తితో పట్టుకుని* చంపడానికి కుట్రపన్నారు. 5 అయితే వాళ్లు, “పండుగ సమయంలో వద్దు, లేదంటే ప్రజల్లో అలజడి రేగుతుంది” అని అనుకున్నారు.
6 యేసు బేతనియలో సీమోను అనే కుష్ఠురోగి ఇంట్లో ఉన్నప్పుడు,+ 7 ఒకామె ఖరీదైన పరిమళ తైలం ఉన్న పాలరాతి* బుడ్డి పట్టుకొని అక్కడికి వచ్చింది. యేసు భోంచేస్తున్నప్పుడు ఆమె ఆ తైలాన్ని ఆయన తల మీద పోయడం మొదలుపెట్టింది. 8 అది చూసినప్పుడు శిష్యులకు చాలా కోపమొచ్చి ఇలా అన్నారు: “ఈమె ఎందుకు ఇలా వృథా చేస్తోంది? 9 ఈ తైలాన్ని ఎక్కువ డబ్బులకు అమ్మి, ఆ డబ్బును పేదవాళ్లకు ఇవ్వొచ్చు కదా.” 10 దాన్ని గమనించి యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “మీరెందుకు ఈమెను ఇబ్బందిపెడుతున్నారు? ఈమె నా విషయంలో మంచి పనే చేసింది. 11 పేదవాళ్లు ఎప్పుడూ మీతోనే ఉంటారు,+ కానీ నేను ఎప్పుడూ మీతో ఉండను.+ 12 ఈమె ఈ పరిమళ తైలాన్ని నా మీద పోసి, నా శరీరాన్ని సమాధి కోసం సిద్ధం చేసింది.+ 13 నేను నిజంగా మీతో చెప్తున్నాను, ప్రపంచంలో సువార్త ప్రకటించే ప్రతీ చోట ఈమె చేసిన ఈ పని గురించి కూడా చెప్పుకుంటూ ఈమెను గుర్తుచేసుకుంటారు.”+
14 తర్వాత పన్నెండుమందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా+ ముఖ్య యాజకుల దగ్గరికి వెళ్లి,+ 15 “ఆయన్ని మీకు అప్పగిస్తే మీరు నాకు ఏమి ఇస్తారు?” అని అడిగాడు.+ అందుకు వాళ్లు అతనికి 30 వెండి నాణేలు ఇస్తామన్నారు.+ 16 అప్పటినుండి అతను యేసును అప్పగించడానికి సరైన అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు.
17 పులవని రొట్టెల పండుగ మొదటి* రోజున+ శిష్యులు యేసు దగ్గరికి వచ్చి, “నువ్వు పస్కా భోజనం తినడానికి మమ్మల్ని ఎక్కడ ఏర్పాట్లు చేయమంటావు?” అని అడిగారు.+ 18 అప్పుడు యేసు ఇలా అన్నాడు: “మీరు నగరంలో ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్లి, ‘ “నా సమయం* దగ్గరపడింది; నా శిష్యులతో కలిసి నీ ఇంట్లో పస్కా పండుగ జరుపుకుంటాను” అని బోధకుడు చెప్తున్నాడు’ అని అనండి.” 19 అప్పుడు శిష్యులు యేసు చెప్పినట్టే చేసి, పస్కా కోసం ఏర్పాట్లు చేశారు.
20 సాయంకాలం అయినప్పుడు,+ ఆయన 12 మంది శిష్యులతో కలిసి భోజనం బల్ల దగ్గర కూర్చున్నాడు.+ 21 వాళ్లు భోజనం చేస్తుండగా ఆయన, “నేను నిజంగా మీతో చెప్తున్నాను, మీలో ఒకతను నన్ను అప్పగిస్తాడు” అన్నాడు.+ 22 ఆ మాటకు వాళ్లు చాలా దుఃఖపడి ప్రతీ ఒక్కరు “ప్రభువా, నేను కాదు కదా?” అని ఆయన్ని అడగడం మొదలుపెట్టారు. 23 అప్పుడు యేసు ఇలా అన్నాడు: “నాతోపాటు గిన్నెలో చెయ్యి ముంచేవాడే నన్ను అప్పగిస్తాడు.+ 24 నిజంగా, మానవ కుమారుడు తన గురించి లేఖనాల్లో రాసివున్నట్టుగానే వెళ్లిపోతున్నాడు. కానీ ఎవరు మానవ కుమారుణ్ణి అప్పగిస్తారో అతనికి శ్రమ!+ అంతకన్నా అతను పుట్టకపోయుంటేనే అతని పరిస్థితి బావుండేది.”+ 25 యేసును అప్పగించబోతున్న యూదా, “రబ్బీ, నేను కాదు కదా?” అని అడిగాడు. అందుకు యేసు ఇలా అన్నాడు: “స్వయంగా నువ్వే ఆ మాట అన్నావు.”
26 వాళ్లు తింటూ ఉండగా యేసు ఒక రొట్టె తీసుకొని, ప్రార్థించి, దాన్ని విరిచి+ తన శిష్యులకు ఇస్తూ ఇలా అన్నాడు: “దీన్ని తీసుకొని తినండి, ఇది నా శరీరాన్ని సూచిస్తోంది.”+ 27 తర్వాత ఆయన ఒక గిన్నె తీసుకొని, కృతజ్ఞతలు చెల్లించి, వాళ్లకు ఇస్తూ ఇలా అన్నాడు: “మీరంతా దీనిలోది తాగండి.+ 28 ఇది, పాపక్షమాపణ కోసం+ అనేకమంది తరఫున+ నేను చిందించబోతున్న నా ‘ఒప్పంద రక్తాన్ని’*+ సూచిస్తోంది. 29 అయితే నేను మీతో చెప్తున్నాను: నా తండ్రి రాజ్యంలో మీతో కలిసి కొత్త ద్రాక్షారసం తాగేంతవరకు నేను మళ్లీ ద్రాక్షారసం తాగను.”+ 30 చివర్లో వాళ్లు స్తుతిగీతాలు* పాడి ఒలీవల కొండకు వెళ్లారు.+
31 తర్వాత యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “ఈ రాత్రి మీరంతా నన్ను వదిలేసి వెళ్లిపోతారు. ఎందుకంటే ‘నేను కాపరిని కొడతాను, మందలోని గొర్రెలు చెదిరిపోతాయి’ అని లేఖనాల్లో రాసివుంది.+ 32 అయితే నేను బ్రతికించబడిన తర్వాత, మీకన్నా ముందు గలిలయకు వెళ్తాను.”+ 33 అప్పుడు పేతురు ఆయనతో, “అందరూ నిన్ను వదిలి వెళ్లిపోయినా నేను మాత్రం నిన్ను ఎన్నడూ వదిలి వెళ్లను” అన్నాడు.+ 34 యేసు అతనితో ఇలా అన్నాడు: “నేను నీతో నిజంగా చెప్తున్నాను, ఈ రాత్రి కోడి కూయక ముందే నేనెవరో తెలీదని నువ్వు మూడుసార్లు అంటావు.”+ 35 అందుకు పేతురు యేసుతో, “నేను నీతోపాటు చనిపోవాల్సి వచ్చినా సరే, నువ్వెవరో తెలీదని అననే అనను” అన్నాడు.+ మిగతా శిష్యులందరూ అదే మాట అన్నారు.
36 తర్వాత యేసు వాళ్లతో కలిసి గెత్సేమనే అనే చోటుకు వచ్చాడు.+ ఆయన శిష్యులతో ఇలా అన్నాడు: “నేను అక్కడికి వెళ్లి ప్రార్థన చేసుకుంటాను, అప్పటిదాకా మీరు ఇక్కడే కూర్చోండి.”+ 37 ఆయన పేతురును, జెబెదయి ఇద్దరు కుమారుల్ని తనతో తీసుకెళ్లాడు. అప్పుడు ఆయనలో దుఃఖం, తీవ్రమైన కలవరం మొదలయ్యాయి.+ 38 వాళ్లతో ఆయన ఇలా అన్నాడు: “నా ప్రాణం పోయేంత తీవ్రమైన దుఃఖం కలుగుతోంది. మీరు ఇక్కడే ఉండి, నాతో పాటు మెలకువగా ఉండండి.” 39 తర్వాత ఆయన కాస్త ముందుకు వెళ్లి మోకాళ్లూని, తలవంచుకొని, ఇలా ప్రార్థించాడు:+ “నా తండ్రీ, సాధ్యమైతే దయచేసి ఈ గిన్నె+ నా దగ్గర నుండి తీసేయి. అయినా, నా ఇష్టప్రకారం కాదు, నీ ఇష్టప్రకారమే జరగాలి.”+
40 ఆయన తిరిగొచ్చేసరికి శిష్యులు నిద్రపోతూ ఉన్నారు. అప్పుడు ఆయన పేతురుతో ఇలా అన్నాడు: “మీరు నాతో కలిసి ఒక్క గంట కూడా మెలకువగా ఉండలేకపోయారా?+ 41 మీరు ప్రలోభంలో పడిపోకుండా ఉండేలా+ మెలకువగా ఉంటూ,+ ప్రార్థన చేస్తూ ఉండండి.+ అయినా, మనసు* సిద్ధమే* కానీ శరీరమే బలహీనం.”+ 42 మళ్లీ ఆయన రెండోసారి వెళ్లి ఇలా ప్రార్థించాడు: “నా తండ్రీ, నేను ఈ గిన్నెలోది తాగితేనే తప్ప దీన్ని తీసేయడం సాధ్యం కాదంటే, నీ ఇష్టప్రకారమే కానివ్వు.”+ 43 ఆయన తిరిగొచ్చేసరికి వాళ్లు నిద్రపోతున్నారు, వాళ్ల కళ్లు నిద్రమత్తుతో బరువెక్కాయి. 44 ఆయన మళ్లీ వాళ్ల దగ్గర నుండి వెళ్లిపోయి, మూడోసారి అవే మాటలు ఉపయోగిస్తూ ప్రార్థించాడు. 45 తర్వాత ఆయన శిష్యుల దగ్గరికి వచ్చి వాళ్లతో ఇలా అన్నాడు: “ఇలాంటి సమయంలో మీరు నిద్రపోతూ విశ్రాంతి తీసుకుంటున్నారా! ఇదిగో! మానవ కుమారుడు పాపుల చేతికి అప్పగించబడే సమయం వచ్చేసింది. 46 లేవండి, వెళ్దాం. ఇదిగో! నన్ను అప్పగించేవాడు దగ్గరికి వచ్చేశాడు.” 47 ఆయన ఇంకా మాట్లాడుతుండగానే, ఇదిగో! పన్నెండుమందిలో ఒకడైన యూదా అక్కడికి వచ్చాడు. అతనితోపాటు ఒక పెద్ద గుంపు కూడా వచ్చింది. వాళ్ల చేతుల్లో కత్తులు, కర్రలు ఉన్నాయి. వాళ్లను ముఖ్య యాజకులు, ప్రజల పెద్దలు పంపించారు.+
48 యేసును అప్పగించబోతున్న యూదా ముందుగానే వాళ్లకు ఒక గుర్తు చెప్పాడు: “నేను ఎవర్ని ముద్దు పెట్టుకుంటానో, ఆయనే యేసు. మీరు ఆయన్ని బంధించండి.” 49 యూదా నేరుగా యేసు దగ్గరికి వెళ్లి, “రబ్బీ, నమస్కారం!” అంటూ ఆప్యాయంగా ఆయనకు ముద్దుపెట్టాడు. 50 కానీ యేసు అతనితో, “నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు?” అన్నాడు.+ అప్పుడు వాళ్లు ముందుకొచ్చి ఆయన్ని పట్టుకొని, బంధించారు. 51 కానీ, ఇదిగో! యేసు శిష్యుల్లో ఒకతను చెయ్యి చాపి, తన కత్తి దూసి ప్రధానయాజకుని దాసుడి చెవి తెగనరికాడు.+ 52 అప్పుడు యేసు ఆ శిష్యుడితో ఇలా అన్నాడు: “నీ కత్తిని తిరిగి ఒరలో* పెట్టు.+ కత్తి పట్టుకున్న వాళ్లందరూ కత్తితోనే నాశనమౌతారు.+ 53 ఈ క్షణంలో నేను 12 సేనల* కన్నా ఎక్కువమంది దేవదూతల్ని పంపించమని+ నా తండ్రిని వేడుకోలేనని అనుకుంటున్నావా? 54 ఒకవేళ నేను అలాచేస్తే, ఈ విధంగా జరగాలని చెప్తున్న లేఖనాలు ఎలా నెరవేరతాయి?” 55 తర్వాత యేసు ఆ ప్రజలతో ఇలా అన్నాడు: “మీరు బందిపోటు దొంగను పట్టుకోవడానికి వచ్చినట్టు కత్తులతో, కర్రలతో నన్ను పట్టుకోవడానికి వచ్చారా? నేను రోజూ ఆలయంలోనే కూర్చొని బోధిస్తున్నా+ మీరు నన్ను పట్టుకోలేదు.+ 56 అయితే, ప్రవక్తలు రాసిన లేఖనాలు నెరవేరడానికే ఇదంతా జరిగింది.”+ అప్పుడు శిష్యులందరూ ఆయన్ని వదిలేసి పారిపోయారు.+
57 యేసును బంధించిన వాళ్లు ఆయన్ని ప్రధానయాజకుడైన కయప+ ఇంటికి తీసుకెళ్లారు. అప్పటికే శాస్త్రులు, పెద్దలు అక్కడ సమావేశమై ఉన్నారు.+ 58 కానీ పేతురు కాస్త దూరంగా ఆయన్ని వెంబడిస్తూ ప్రధానయాజకుడి ఇంటి ప్రాంగణం వరకు వచ్చాడు; ఆ ప్రాంగణంలోకి వెళ్లాక అక్కడ ఏమి జరుగుతుందో చూడడానికి ఆ ఇంటి పనివాళ్లతో కలిసి కూర్చున్నాడు.+
59 అప్పుడు ముఖ్య యాజకులు, మహాసభ వాళ్లందరూ యేసును చంపించడానికి అబద్ధ సాక్ష్యాల కోసం చూస్తూ ఉన్నారు.+ 60 చాలామంది అబద్ధ సాక్షులు వచ్చారు కానీ, తగిన సాక్ష్యం ఒక్కటి కూడా వాళ్లకు దొరకలేదు.+ ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు ముందుకొచ్చి, 61 “ఇతను, ‘నేను ఆలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో తిరిగి కడతాను’ అన్నాడు” అని చెప్పారు.+ 62 దాంతో ప్రధానయాజకుడు లేచి నిలబడి, “నువ్వేమీ మాట్లాడవా? నీకు వ్యతిరేకంగా వీళ్లు చెప్తున్న సాక్ష్యాల గురించి నువ్వు ఏమంటావు?” అని యేసును అడిగాడు.+ 63 కానీ యేసు ఏమీ మాట్లాడలేదు.+ కాబట్టి ప్రధానయాజకుడు యేసుతో ఇలా అన్నాడు: “జీవంగల దేవుని ముందు ఒట్టేసి చెప్పు, నువ్వు దేవుని కుమారుడివైన క్రీస్తువా?”+ 64 అందుకు యేసు అతనితో ఇలా అన్నాడు: “స్వయంగా నువ్వే ఆ మాట అన్నావు కదా. అయితే నేను మీతో చెప్తున్నాను: ఇప్పటినుండి మానవ కుమారుడు+ శక్తిమంతుడైన దేవుని కుడిచెయ్యి దగ్గర కూర్చొనివుండడం,+ ఆకాశ మేఘాల మీద రావడం మీరు చూస్తారు.”+ 65 దాంతో ప్రధానయాజకుడు తన పైవస్త్రాలు చింపుకొని ఇలా అన్నాడు: “ఇతను దైవదూషణ చేశాడు! ఇక మనకు సాక్షులతో పనేంటి? ఆ దైవదూషణను మీరే విన్నారు కదా. 66 మీరేమంటారు?” అందుకు వాళ్లు, “ఇతను మరణశిక్షకు అర్హుడు” అన్నారు.+ 67 తర్వాత వాళ్లు ఆయన ముఖం మీద ఉమ్మేసి,+ తమ పిడికిళ్లతో ఆయన్ని గుద్దారు.+ కొందరు ఆయన చెంప మీద కొడుతూ,+ 68 “క్రీస్తూ, నిన్ను ఎవరు కొట్టారో ప్రవచించు” అన్నారు.
69 ఆ సమయంలో పేతురు బయట ప్రాంగణంలో కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఒక పనమ్మాయి అతని దగ్గరికి వచ్చి, “నువ్వు కూడా గలిలయవాడైన యేసుతో ఉండేవాడివి కదా!” అంది.+ 70 కానీ, అతను అందుకు ఒప్పుకోకుండా అందరిముందూ ఇలా అన్నాడు: “నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థంకావట్లేదు.” 71 తర్వాత అతను బయటి గుమ్మం వైపుకు వెళ్లినప్పుడు, అక్కడ ఇంకొక పనమ్మాయి అతన్ని గమనించి, అక్కడున్న వాళ్లతో, “ఇతను నజరేయుడైన యేసుతో ఉండేవాడు” అని అంది.+ 72 ఈసారి కూడా పేతురు ఒప్పుకోకుండా, “ఆ మనిషి ఎవరో నాకు తెలీదు!” అంటూ ఒట్టుపెట్టుకున్నాడు. 73 కాసేపటికి, చుట్టుపక్కల నిలబడివున్న వాళ్లు వచ్చి, “ఖచ్చితంగా నువ్వు కూడా వాళ్లలో ఒకడివే, నీ మాటతీరు* చూస్తేనే తెలిసిపోతుంది” అని పేతురుతో అన్నారు. 74 అప్పుడు అతను తనను తాను శపించుకుంటూ, ఒట్టుపెట్టుకుంటూ, “ఆ మనిషి ఎవరో నాకు తెలీదు!” అనడం మొదలుపెట్టాడు. వెంటనే కోడి కూసింది. 75 అప్పుడు పేతురుకు, “కోడి కూయక ముందే నేనెవరో తెలీదని నువ్వు మూడుసార్లు అంటావు” అని యేసు అన్న మాటలు గుర్తుకొచ్చాయి.+ దాంతో అతను బయటికి వెళ్లి, కుమిలికుమిలి ఏడ్చాడు.