యోహాను సువార్త
19 తర్వాత పిలాతు యేసును తీసుకెళ్లి కొరడాలతో కొట్టించాడు.+ 2 సైనికులు ఒక ముళ్ల కిరీటం అల్లి యేసు తలమీద పెట్టారు, ఆయనకు ఊదారంగు వస్త్రం తొడిగించారు.+ 3 వాళ్లు యేసు దగ్గరికి వస్తూ, “యూదుల రాజా, నమస్కారం!”* అంటూ ఉన్నారు. అంతేకాదు వాళ్లు ఆయన్ని చెంప మీద కొడుతూ ఉన్నారు.+ 4 పిలాతు మళ్లీ బయటికి వెళ్లి యూదులతో, “ఇదిగో! ఇతనిలో నాకు ఏ తప్పూ కనబడలేదని+ మీరు తెలుసుకోవడం కోసం నేను ఇతన్ని బయటికి తీసుకొస్తున్నాను” అన్నాడు. 5 అప్పుడు యేసు ముళ్ల కిరీటంతో, ఊదారంగు వస్త్రంతో బయటికి వచ్చాడు. పిలాతు వాళ్లతో, “ఇదిగో! ఈ మనిషి!” అన్నాడు. 6 అయితే ముఖ్య యాజకులు, అధికారులు యేసును చూసినప్పుడు, “అతనికి కొయ్యపై శిక్ష వేయండి! అతనికి కొయ్యపై శిక్ష వేయండి!”* అని అరిచారు.+ పిలాతు వాళ్లతో, “మీరే ఇతన్ని తీసుకెళ్లి మరణశిక్ష వేయండి,* నాకైతే ఇతనిలో ఏ తప్పూ కనిపించట్లేదు” అన్నాడు.+ 7 అప్పుడు యూదులు, “మాకో చట్టం ఉంది, ఆ చట్టం ప్రకారం అతను చనిపోవాలి,+ ఎందుకంటే అతను దేవుని కుమారుణ్ణని చెప్పుకున్నాడు” అన్నారు.+
8 వాళ్ల మాటలు విన్నప్పుడు పిలాతు ఇంకా ఎక్కువగా భయపడ్డాడు. 9 అతను మళ్లీ అధిపతి భవనంలోకి వెళ్లి యేసును, “నువ్వు ఎక్కడి నుండి వచ్చావు?” అని అడిగాడు. అయితే యేసు అతనికి ఏమీ చెప్పలేదు.+ 10 దాంతో పిలాతు, “నువ్వు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేసే అధికారం, నీకు మరణశిక్ష వేసే* అధికారం నాకు ఉందని నీకు తెలీదా?” అని యేసుతో అన్నాడు. 11 అప్పుడు యేసు, “పైనుండి ఇవ్వబడివుంటే తప్ప నా మీద నీకు అసలు ఎలాంటి అధికారమూ ఉండదు. అందుకే నన్ను నీకు అప్పగించిన మనిషి మీద ఇంకా ఎక్కువ పాపం ఉంది” అన్నాడు.
12 దాంతో పిలాతు ఏదోవిధంగా యేసును విడుదల చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ యూదులు, “అతన్ని విడుదల చేస్తే నువ్వు కైసరుకు స్నేహితుడివి కావు. తాను రాజునని చెప్పుకునే ప్రతీ వ్యక్తి కైసరుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టే”* అని అరిచారు.+ 13 పిలాతు ఆ మాటలు విన్నాక యేసును బయటికి తీసుకొచ్చి, రాళ్లు పరిచిన స్థలంలో ఉన్న న్యాయపీఠం మీద కూర్చున్నాడు. హీబ్రూ భాషలో ఆ స్థలాన్ని గబ్బతా అంటారు. 14 అది పస్కాకు* సిద్ధపడే రోజు,+ సమయం మధ్యాహ్నం దాదాపు 12 గంటలు.* అప్పుడు పిలాతు యూదులతో ఇలా అన్నాడు: “ఇదిగో! మీ రాజు!” 15 అయితే వాళ్లు, “అతన్ని చంపేయండి! అతన్ని చంపేయండి! అతనికి కొయ్యపై శిక్ష వేయండి!”* అని అరిచారు. అప్పుడు పిలాతు, “నేను మీ రాజుకు మరణశిక్ష వేయాలా?” అన్నాడు. అందుకు ముఖ్య యాజకులు, “కైసరు ఒక్కడే మా రాజు” అన్నారు. 16 అప్పుడు పిలాతు, కొయ్య మీద మరణశిక్ష వేయడానికి యేసును వాళ్లకు అప్పగించాడు.+
దాంతో వాళ్లు యేసును తీసుకెళ్లిపోయారు. 17 యేసే స్వయంగా హింసాకొయ్యను* మోసుకుంటూ, “కపాల స్థలం” అనబడిన చోటికి వెళ్లాడు.+ హీబ్రూ భాషలో దాన్ని గొల్గొతా అని పిలుస్తారు.+ 18 అక్కడ వాళ్లు ఆయన్ని మేకులతో కొయ్యకు దిగగొట్టి,+ ఇంకో ఇద్దరితోపాటు వేలాడదీశారు. ఒకర్ని ఆయన కుడిపక్కన, ఇంకొకర్ని ఆయన ఎడమపక్కన వేలాడదీశారు.+ 19 అంతేకాదు, పిలాతు ఒక పలక మీద “నజరేయుడైన యేసు యూదుల రాజు” అని రాయించి ఆ హింసాకొయ్యపై* పెట్టించాడు.+ 20 యేసును కొయ్యపై వేలాడదీసిన ఆ చోటు యెరూషలేముకు దగ్గర్లో ఉంది కాబట్టి చాలామంది యూదులు ఆ మాటలు చదివారు; అవి హీబ్రూ, లాటిన్, గ్రీకు భాషల్లో రాయబడ్డాయి. 21 అయితే యూదుల ముఖ్య యాజకులు పిలాతుతో ఇలా అన్నారు: “ ‘యూదుల రాజు’ అని రాయవద్దు, ‘నేను యూదుల రాజుని’ అని అతను చెప్పుకున్నాడు అన్నట్టు రాయి.” 22 దానికి పిలాతు, “నేను రాసిందేదో రాశాను” అన్నాడు.
23 సైనికులు యేసును మేకులతో కొయ్యకు దిగగొట్టిన తర్వాత, ఆయన పైవస్త్రాలు తీసుకుని ఒక్కో సైనికుడికి ఒక్కో భాగం వచ్చేలా వాటిని నాలుగు భాగాలు చేశారు. వాళ్లు ఆయన లోపలి వస్త్రాన్ని కూడా తీసుకున్నారు. అది కుట్టులేకుండా పైనుండి కిందివరకు నేయబడింది. 24 కాబట్టి వాళ్లు, “మనం దీన్ని చింపకుండా, చీట్లు* వేసి ఎవరికి వస్తుందో చూద్దాం” అని చెప్పుకున్నారు.+ “వాళ్లు నా వస్త్రాల్ని పంచుకున్నారు, నా వస్త్రాల కోసం చీట్లు వేసుకున్నారు” అనే లేఖనం నెరవేరడానికి ఇలా జరిగింది.+ కాబట్టి ఆ సైనికులు నిజంగా లేఖనంలో ఉన్నట్టే చేశారు.
25 యేసు హింసాకొయ్య* దగ్గర ఆయన తల్లి,+ ఆమె సహోదరి; క్లోపా భార్య మరియ, మగ్దలేనే మరియ+ నిలబడివున్నారు. 26 తన తల్లి, తాను ప్రేమించిన శిష్యుడు+ దగ్గర్లో నిలబడి ఉండడం చూసి యేసు తన తల్లితో, “అమ్మా, ఇదిగో! నీ కుమారుడు!” అన్నాడు. 27 తర్వాత ఆ శిష్యుడితో, “ఇదిగో! మీ అమ్మ!” అన్నాడు. కాబట్టి ఆమె తన ఇంట్లో ఉండేలా ఆ శిష్యుడు ఆ రోజే ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు.
28 ఆ తర్వాత యేసు అప్పటికి అంతా పూర్తయిందని తెలిసి, లేఖనం నెరవేర్చడం కోసం, “నాకు దాహంగా ఉంది”+ అన్నాడు. 29 అక్కడ పుల్లటి ద్రాక్షారసం నిండివున్న ఒక పాత్ర ఉంది. కాబట్టి అక్కడున్న వాళ్లు ఒక స్పాంజీని ఆ పుల్లటి ద్రాక్షారసంలో ముంచి, హిస్సోపు* కొమ్మకు తగిలించి ఆయన నోటికి అందించారు.+ 30 యేసు ఆ పుల్లటి ద్రాక్షారసాన్ని రుచి చూసిన తర్వాత, “అంతా పూర్తయింది!”+ అన్నాడు. అప్పుడు ఆయన తల వంచి, తుదిశ్వాస విడిచాడు.*+
31 అది సిద్ధపడే రోజు;+ విశ్రాంతి రోజున (అది గొప్ప విశ్రాంతి రోజు)+ మృతదేహాలు హింసాకొయ్యలకు వేలాడుతూ ఉండకూడదు+ కాబట్టి యూదులు పిలాతును వాళ్ల కాళ్లు విరగగొట్టించి వాళ్ల దేహాల్ని కిందికి దింపించమని అడిగారు. 32 అప్పుడు సైనికులు వచ్చి, యేసు పక్కన వేలాడదీయబడిన మొదటి వ్యక్తి కాళ్లు, రెండో వ్యక్తి కాళ్లు విరగగొట్టారు. 33 కానీ వాళ్లు యేసు దగ్గరికి వచ్చేసరికి ఆయన అప్పటికే చనిపోయి ఉండడంతో వాళ్లు ఆయన కాళ్లు విరగగొట్టలేదు. 34 అయితే ఒక సైనికుడు ఈటెతో ఆయన పక్కటెముకల్లో పొడిచాడు.+ వెంటనే రక్తం, నీళ్లు బయటికి వచ్చాయి. 35 దీన్ని చూసిన వ్యక్తి ఈ సాక్ష్యం ఇచ్చాడు, అతని సాక్ష్యం సత్యం. తాను చెప్తున్నది సత్యమని అతనికి తెలుసు, కాబట్టి మీరు కూడా నమ్మేలా అతను ఈ విషయాలు చెప్తున్నాడు.+ 36 నిజానికి, “ఆయన ఎముకల్లో ఒక్కటి కూడా విరగగొట్టబడదు” అనే లేఖనం నెరవేరడానికి+ ఇవి జరిగాయి. 37 అలాగే, “వాళ్లు తాము పొడిచిన వ్యక్తి వైపు చూస్తారు” అని ఇంకో లేఖనం చెప్తుంది.+
38 ఇవి జరిగాక, అరిమతయియకు చెందిన యోసేపు యేసు శరీరాన్ని తీసుకెళ్లడానికి పిలాతును అనుమతి అడిగాడు. ఈ యోసేపు యేసు శిష్యుడు, కానీ యూదులకు భయపడి ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.+ పిలాతు అనుమతి ఇవ్వడంతో అతను వచ్చి, యేసు శరీరాన్ని తీసుకెళ్లాడు.+ 39 అంతకుముందు రాత్రిపూట యేసు దగ్గరికి వచ్చిన నీకొదేము+ కూడా సుమారు 30 కిలోల* బోళం-అగరు మిశ్రమాన్ని* తీసుకొచ్చాడు.+ 40 కాబట్టి వాళ్లు యేసు శరీరాన్ని తీసుకుని, సమాధి చేసేముందు యూదుల ఆచారం ప్రకారం సుగంధ ద్రవ్యాలు ఉంచిన నారవస్త్రాలతో దాన్ని చుట్టారు.+ 41 యేసుకు మరణశిక్ష విధించిన* చోట ఒక తోట ఉంది, ఆ తోటలో ఒక కొత్త సమాధి*+ ఉంది. దానిలో అప్పటివరకు ఎవర్నీ పెట్టలేదు. 42 అది యూదుల సిద్ధపడే రోజు, పైగా ఆ సమాధి దగ్గర్లో ఉంది కాబట్టి వాళ్లు యేసును అందులో పెట్టారు.