న్యాయాధిపతులు
6 అయితే ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టిలో మళ్లీ చెడుగా ప్రవర్తించారు,+ కాబట్టి యెహోవా వాళ్లను ఏడు సంవత్సరాలు మిద్యానీయుల చేతికి అప్పగించాడు.+ 2 మిద్యానీయులు ఇశ్రాయేలీయుల్ని అణచివేయడం మొదలుపెట్టారు.+ వాళ్ల కారణంగా ఇశ్రాయేలీయులు కొండ ప్రాంతాల్లో, గుహల్లో, చేరుకోవడానికి కష్టంగా ఉండే చోట్లలో తమ కోసం రహస్య స్థలాల్ని* ఏర్పాటు చేసుకున్నారు.+ 3 ఇశ్రాయేలీయులు విత్తనాలు విత్తినప్పుడల్లా మిద్యానీయులు, అమాలేకీయులు,+ తూర్పు ప్రజలు+ వచ్చి దాడి చేసేవాళ్లు. 4 వాళ్లు ఇశ్రాయేలీయులకు ఎదురుగా మకాం వేసి, గాజా వరకు దేశంలోని పంటనంతా నాశనం చేసేవాళ్లు; ఇశ్రాయేలీయులు తినడానికి ఏమీ విడిచిపెట్టేవాళ్లు కాదు; గొర్రెను గానీ, ఎద్దును గానీ, గాడిదను గానీ ఉండనిచ్చేవాళ్లు కాదు.+ 5 వాళ్లు తమ పశువులతో, తమ డేరాలతో మిడతలంత విస్తారంగా వచ్చేవాళ్లు;+ వాళ్లను, వాళ్ల ఒంటెల్ని లెక్కపెట్టడం అసాధ్యం,+ వాళ్లు దేశాన్ని నాశనం చేయడానికి వచ్చేవాళ్లు. 6 అలా, మిద్యానీయుల వల్ల ఇశ్రాయేలీయులు చాలా పేదవాళ్లు అయ్యారు; దాంతో ఇశ్రాయేలీయులు సహాయం కోసం యెహోవాకు మొరపెట్టారు.+
7 మిద్యానీయుల కారణంగా ఇశ్రాయేలీయులు సహాయం కోసం యెహోవాకు మొరపెట్టినప్పుడు,+ 8 యెహోవా ఒక ప్రవక్తను ఇశ్రాయేలీయుల దగ్గరికి పంపించాడు, అతను వాళ్లతో ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు, ‘నేను మిమ్మల్ని దాస్య గృహమైన ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చాను.+ 9 నేను మిమ్మల్ని ఐగుప్తు చేతిలో నుండి, మిమ్మల్ని అణచివేసిన వాళ్లందరి చేతుల్లో నుండి రక్షించాను, మీ శత్రువుల్ని మీ ఎదుట నుండి వెళ్లగొట్టి వాళ్ల దేశాన్ని మీకు ఇచ్చాను.+ 10 నేను మీతో, “నేను మీ దేవుడైన యెహోవాను.+ మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో ఆ అమోరీయుల దేవుళ్లను మీరు పూజించకూడదు”*+ అని చెప్పాను. కానీ మీరు నా మాట వినలేదు.’ ”+
11 తర్వాత యెహోవా దూత వచ్చి+ ఒఫ్రాలో ఉన్న ఒక పెద్ద చెట్టు కింద కూర్చున్నాడు, ఆ చెట్టు అబీయెజ్రీయుడైన+ యోవాషుకు చెందినది. అతని కుమారుడైన గిద్యోను+ మిద్యానీయులకు కనిపించకుండా చాటుగా ద్రాక్షతొట్టిలో గోధుమల్ని నూరుస్తున్నాడు. 12 యెహోవా దూత అతనికి కనిపించి, “బలమైన యోధుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు”+ అని అన్నాడు. 13 అందుకు గిద్యోను ఆ దూతతో ఇలా అన్నాడు: “క్షమించు నా ప్రభూ, యెహోవా మాకు తోడుగా ఉంటే ఇవన్నీ మాకు ఎందుకు జరిగాయి?+ మా తండ్రులు, ‘యెహోవా మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చాడు’+ అంటూ మాతో చెప్పిన+ ఆయన అద్భుతమైన పనులన్నీ ఏమైపోయాయి? ఇప్పుడు యెహోవా మమ్మల్ని విడిచిపెట్టేశాడు,+ ఆయన మమ్మల్ని మిద్యానీయుల చేతికి అప్పగించాడు.” 14 అప్పుడు యెహోవా అతని వైపు తిరిగి ఇలా చెప్పాడు: “వెళ్లు, నీకున్న బలంతో నువ్వు ఇశ్రాయేలీయుల్ని మిద్యానీయుల చేతి నుండి రక్షిస్తావు.+ నిన్ను పంపిస్తున్నది నేనే కదా?” 15 అందుకు గిద్యోను, “క్షమించు యెహోవా, నేను ఇశ్రాయేలీయుల్ని ఎలా రక్షించగలను? ఇదిగో! నా కుటుంబం* మనష్షే గోత్రంలో అన్నిటికన్నా తక్కువది, నేను నా తండ్రి ఇంటి వాళ్లందరిలో ఏమాత్రం ప్రాముఖ్యత లేనివాణ్ణి” అన్నాడు. 16 అయితే యెహోవా అతనితో, “నేను నీకు తోడుగా ఉంటాను+ కాబట్టి నువ్వు ఒక్క మనిషిని చంపినట్టు మిద్యానీయుల్ని చంపుతావు” అన్నాడు.
17 అప్పుడు గిద్యోను ఆయనతో ఇలా అన్నాడు: “నేను ఒకవేళ నీ దృష్టిలో అనుగ్రహం పొందివుంటే, నాతో మాట్లాడుతుంది నువ్వే అని గుర్తుపట్టేలా ఒక సూచన ఇవ్వు. 18 నేను తిరిగొచ్చి, నా కానుకను నీ ముందు పెట్టేవరకు దయచేసి ఇక్కడి నుండి వెళ్లిపోవద్దు.”+ అందుకు ఆయన, “నువ్వు తిరిగొచ్చేవరకు నేను ఇక్కడే ఉంటాను” అన్నాడు. 19 అప్పుడు గిద్యోను లోపలికి వెళ్లి ఒక మేకపిల్లను సిద్ధం చేసి, ఒక ఈఫా* పిండితో పులవని రొట్టెలు చేశాడు.+ అతను ఆ మాంసాన్ని ఒక గంపలో పెట్టి, పులుసును ఒక వంటపాత్రలో పోసి, వాటిని ఆయన దగ్గరికి తీసుకొచ్చి ఆ పెద్ద చెట్టు కింద వడ్డించాడు.
20 అప్పుడు సత్యదేవుని దూత అతనితో, “మాంసాన్ని, పులవని రొట్టెల్ని తీసుకుని అక్కడున్న పెద్ద రాయి మీద పెట్టు, వాటి మీద పులుసు పోయి” అన్నాడు. అతను అలాగే చేశాడు. 21 యెహోవా దూత తన చేతిలో ఉన్న కర్రను చాపి ఆ మాంసాన్ని, పులవని రొట్టెల్ని తాకాడు; దాంతో ఆ రాయిలో నుండి అగ్ని వచ్చి మాంసాన్ని, పులవని రొట్టెల్ని దహించి వేసింది.+ అప్పుడు యెహోవా దూత అదృశ్యమయ్యాడు. 22 అప్పుడు, ఆయన యెహోవా దూత+ అని గిద్యోనుకు అర్థమైంది.
గిద్యోను వెంటనే, “అయ్యో, సర్వోన్నత ప్రభువా యెహోవా, నేను యెహోవా దూతను కళ్లారా చూశాను!”+ అన్నాడు. 23 కానీ యెహోవా అతనితో, “నీకు శాంతి కలగాలి. భయపడకు;+ నువ్వు చనిపోవు” అన్నాడు. 24 అప్పుడు గిద్యోను అక్కడ యెహోవా కోసం ఒక బలిపీఠం కట్టాడు, దాన్ని ఈ రోజు వరకు యెహోవా-షాలోము* అని పిలుస్తున్నారు.+ అది ఇప్పటికీ అబీయెజ్రీయులకు చెందిన ఒఫ్రాలోనే ఉంది.
25 ఆ రాత్రి యెహోవా గిద్యోనుకు ఇలా చెప్పాడు: “నీ తండ్రికి చెందిన కోడెదూడను, అంటే ఏడేళ్ల వయసున్న రెండో కోడెదూడను తీసుకో; నీ తండ్రికి చెందిన బయలు బలిపీఠాన్ని పడగొట్టి, దాని పక్కనున్న పూజా కర్రను* నరికేయి.+ 26 ఈ ఎత్తైన స్థలంలో రాళ్లను వరుసగా పేర్చి, నీ దేవుడైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టు. తర్వాత రెండో కోడెదూడను తీసుకుని, నువ్వు నరికిన పూజా కర్ర* చెక్కల మీద దాన్ని దహనబలిగా అర్పించు.” 27 కాబట్టి గిద్యోను తన సేవకుల్లో పదిమందిని తీసుకుని యెహోవా చెప్పినట్టే చేశాడు. అయితే అతను తన తండ్రి ఇంటివాళ్లకు, నగరంలోని ప్రజలకు చాలా భయపడి పగలు కాకుండా రాత్రిపూట ఆ పనిని చేశాడు.
28 మర్నాడు ఉదయాన్నే ఆ నగర ప్రజలు లేచినప్పుడు, బయలు బలిపీఠం పడగొట్టబడి ఉండడం, దాని పక్కనున్న పూజా కర్ర* నరకబడి ఉండడం, కొత్తగా కట్టిన బలిపీఠం మీద రెండో కోడెదూడ అర్పించబడి ఉండడం చూశారు. 29 వాళ్లు ఒకరితో ఒకరు, “ఇది ఎవరు చేశారు?” అని మాట్లాడుకున్నారు. విచారణ చేసిన తర్వాత వాళ్లు, “ఇది యోవాషు కుమారుడైన గిద్యోను పని” అన్నారు. 30 కాబట్టి నగర ప్రజలు యోవాషుతో, “నీ కుమారుణ్ణి బయటికి తీసుకురా, అతను చావాలి; ఎందుకంటే అతను బయలు బలిపీఠాన్ని పడగొట్టాడు, దాని పక్కనున్న పూజా కర్రను* నరికేశాడు” అన్నారు. 31 అప్పుడు యోవాషు+ తనతో గొడవపడడానికి వచ్చిన వాళ్లందరితో, “మీరు బయలు తరఫున వాదించాల్సిన అవసరం ఉందా? మీరు బయలును రక్షించాలా? అతని తరఫున ఎవరైనా మాట్లాడితే వాళ్లు ఈ ఉదయం చంపబడాలి.+ బయలు బలిపీఠాన్ని ఎవరో పడగొట్టారు కాబట్టి బయలే గనుక దేవుడైతే అతని తరఫున అతన్నే వాదించుకోనివ్వండి”+ అన్నాడు. 32 అతను, “బయలు బలిపీఠాన్ని ఎవరో పడగొట్టారు కాబట్టి అతని తరఫున అతన్నే వాదించుకోనివ్వండి” అని అంటూ ఆ రోజు గిద్యోనుకు యెరుబ్బయలు* అని పేరుపెట్టాడు.
33 తర్వాత మిద్యానీయులందరూ,+ అమాలేకీయులందరూ,+ తూర్పు ప్రజలందరూ ఏకమై,+ నదిని దాటి యెజ్రెయేలు లోయలోకి వచ్చి అక్కడ దిగారు. 34 అప్పుడు యెహోవా పవిత్రశక్తి గిద్యోను మీదికి వచ్చింది;*+ అతను బూర* ఊదాడు,+ అబీయెజ్రీయులు+ అతనికి మద్దతుగా అతని దగ్గరికి వచ్చారు. 35 అతను మనష్షే ప్రాంతమంతటికీ సందేశకుల్ని పంపించాడు, దాంతో వాళ్లు కూడా మద్దతుగా వచ్చారు. అతను ఆషేరు, జెబూలూను, నఫ్తాలి ప్రాంతాలకు కూడా సందేశకుల్ని పంపించాడు, వాళ్లు అతన్ని కలవడానికి వచ్చారు.
36 అప్పుడు గిద్యోను సత్యదేవునితో ఇలా అన్నాడు: “నువ్వు వాగ్దానం చేసినట్టు, నా ద్వారా ఇశ్రాయేలీయుల్ని రక్షిస్తున్నట్లయితే,+ 37 నేను ఇక్కడ కళ్లంలో* గొర్రెబొచ్చును ఉంచుతున్నాను, ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడి దాని చుట్టూ ఉన్న నేలంతా పొడిగా ఉంటే, నువ్వు వాగ్దానం చేసినట్టు నా ద్వారా ఇశ్రాయేలీయుల్ని రక్షిస్తావని అప్పుడు నాకు తెలుస్తుంది.” 38 సరిగ్గా అలాగే జరిగింది. అతను మర్నాడు ఉదయాన్నే లేచి, ఆ గొర్రెబొచ్చును పిండాడు; ఆ గొర్రెబొచ్చు నుండి ఒక పెద్ద గిన్నె నిండా నీళ్లు వచ్చాయి. 39 అయితే గిద్యోను సత్యదేవునితో ఇలా అన్నాడు: “నీ కోపం నా మీద రగులుకోనివ్వకు, ఇంకొక్కసారే నిన్ను అడగనివ్వు. దయచేసి గొర్రెబొచ్చుతో నన్ను ఇంకొక్కసారి పరీక్షించనివ్వు. దయచేసి, గొర్రెబొచ్చు మాత్రమే పొడిగా ఉండి, నేలమీదంతా మంచు ఉండేలా చేయి.” 40 ఆ రాత్రి దేవుడు సరిగ్గా అలాగే చేశాడు; గొర్రెబొచ్చు మాత్రమే పొడిగా ఉండి, నేలమీదంతా మంచు ఉంది.