సంఖ్యాకాండం
32 రూబేను వంశస్థులకు,+ గాదు వంశస్థులకు+ చాలా పశుసంపద ఉండడంతో వాళ్లు యాజెరును,+ గిలాదును చూసి ఆ ప్రాంతం పశువులకు బాగుంటుందని అనుకున్నారు. 2 కాబట్టి గాదు వంశస్థులు, రూబేను వంశస్థులు మోషే దగ్గరికి, యాజకుడైన ఎలియాజరు దగ్గరికి, సమాజ ప్రధానుల దగ్గరికి వచ్చి ఇలా అన్నారు: 3 “అతారోతు, దీబోను, యాజెరు, నిమ్రా, హెష్బోను,+ ఏలాలే, షెబాము, నెబో,+ బెయోను+ ప్రాంతాలు ఉన్న ప్రదేశం, 4 అంటే ఇశ్రాయేలు సమాజం ముందు యెహోవా ఓడించిన ప్రదేశం+ పశువులకు చాలా బాగుంటుంది; నీ సేవకులమైన మాకు చాలా పశువులు ఉన్నాయి.”+ 5 వాళ్లు ఇంకా ఇలా అన్నారు: “నీ దయ మా మీద ఉంటే, నీ సేవకులమైన మాకు ఈ ప్రదేశాన్ని స్వాస్థ్యంగా ఇవ్వు. మమ్మల్ని యొర్దాను నది దాటనివ్వకు.”
6 అప్పుడు మోషే గాదు వంశస్థులతో, రూబేను వంశస్థులతో ఇలా అన్నాడు: “మీ సహోదరులేమో యుద్ధానికి వెళ్తుంటే, మీరు మాత్రం ఇక్కడే నివసిస్తూ ఉంటారా? 7 ఇశ్రాయేలు ప్రజలు ఈ నదిని దాటి, యెహోవా తమకు ఖచ్చితంగా ఇవ్వబోతున్న దేశంలోకి వెళ్లకుండా మీరెందుకు వాళ్లను అధైర్యపరుస్తున్నారు? 8 ఆ దేశాన్ని చూసిరమ్మని కాదేషు-బర్నేయ నుండి నేను మీ తండ్రుల్ని పంపించినప్పుడు వాళ్లు కూడా ఇలాగే చేశారు.+ 9 వాళ్లు ఎష్కోలు లోయ*+ వరకు వెళ్లి ఆ దేశాన్ని చూసినప్పుడు, యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబోతున్న దేశంలోకి వెళ్లకుండా వాళ్లను అధైర్యపర్చారు.+ 10 ఆ రోజు యెహోవా కోపం రగులుకుంది, దాంతో ఆయన ఇలా ప్రమాణం చేశాడు:+ 11 ‘ఐగుప్తు నుండి బయటికి వచ్చినవాళ్లలో 20 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసున్న వాళ్లు నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేసిన దేశాన్ని+ చూడరు.+ ఎందుకంటే వాళ్లు నిండు హృదయంతో నన్ను అనుసరించలేదు. 12 వాళ్లలో కనిజ్జీయుడైన యెఫున్నె కుమారుడు కాలేబు,+ నూను కుమారుడు యెహోషువ+ మాత్రమే ఆ దేశాన్ని చూస్తారు. ఎందుకంటే, వాళ్లు నిండు హృదయంతో యెహోవాను అనుసరించారు.’+ 13 కాబట్టి ఇశ్రాయేలీయుల మీద యెహోవా కోపం రగులుకుంది, దాంతో ఆయన 40 సంవత్సరాల పాటు వాళ్లు ఎడారిలో తిరిగేలా చేశాడు;+ అంటే యెహోవా దృష్టిలో చెడు చేస్తూ వచ్చిన ఆ తరమంతా లేకుండా పోయే వరకు వాళ్లు అలా తిరిగేలా చేశాడు.+ 14 ఇప్పుడేమో పాపులైన మీరు మీ తండ్రుల్లాగే ప్రవర్తిస్తూ ఇశ్రాయేలీయుల మీద మండుతున్న యెహోవా కోపాన్ని ఇంకా ఎక్కువ చేస్తున్నారు. 15 మీరు ఆయన్ని అనుసరించడం మానేస్తే, ఆయన ఖచ్చితంగా వాళ్లను మళ్లీ ఎడారిలో వదిలేస్తాడు; అలా మీరు ఈ ప్రజలందరి మీదికి విపత్తు తీసుకొస్తారు.”
16 తర్వాత వాళ్లు అతని దగ్గరికి వెళ్లి ఇలా అన్నారు: “మా పశువుల కోసం రాతి దొడ్లను, మా పిల్లల కోసం నగరాల్ని కట్టుకోనివ్వు. 17 మేము ఎప్పటిలాగే యుద్ధానికి సిద్ధంగా ఉంటూ,+ ఇశ్రాయేలీయుల్ని వాళ్ల చోటికి తీసుకెళ్లే వరకు వాళ్ల ముందు వెళ్తాం. ఈలోగా మా పిల్లలు ప్రాకారాలున్న నగరాల్లో నివసిస్తూ ఈ ప్రదేశంలోని వాళ్ల నుండి సురక్షితంగా ఉంటారు. 18 ఇశ్రాయేలీయుల్లో ప్రతీ వ్యక్తి తన భూమిని స్వాస్థ్యంగా పొందేవరకు మేము మా ఇళ్లకు తిరిగెళ్లం.+ 19 యొర్దానుకు అవతలి వైపు వాళ్లతోపాటు మాకు స్వాస్థ్యం లభించదు. ఎందుకంటే, యొర్దానుకు తూర్పు వైపున మేము మా స్వాస్థ్యాన్ని పొందాం.”+
20 అప్పుడు మోషే వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు ఇలా చేస్తే సరే: యుద్ధం కోసం యెహోవా ముందు ఆయుధాలు చేపట్టండి;+ 21 యెహోవా తన శత్రువుల్ని తన ముందు నుండి వెళ్లగొడుతుండగా+ మీలో ప్రతీ ఒక్కరు ఆయుధాలు చేపట్టి, ఆయన ముందు యొర్దాను నది దాటి, 22 యెహోవా ఎదుట ఆ దేశాన్ని స్వాధీనం చేసుకునే వరకు+ యుద్ధం చేయాలి. తర్వాత మీరు తిరిగిరావచ్చు.+ అలా మీరు యెహోవా ముందు, ఇశ్రాయేలీయుల ముందు నిర్దోషులుగా ఉంటారు. అప్పుడు యెహోవా ఎదుట ఈ ప్రదేశం మీ సొత్తు అవుతుంది.+ 23 కానీ మీరు అలా చేయకపోతే, మీరు యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసినవాళ్లౌతారు. మీ పాపానికి మీరు శిక్ష అనుభవిస్తారు. 24 కాబట్టి మీరు మీ పిల్లల కోసం నగరాల్ని, మీ మందల కోసం దొడ్లను కట్టుకోవచ్చు,+ అయితే మీరు మీ మాటకు కట్టుబడి ఉండాలి.”
25 గాదు వంశస్థులు, రూబేను వంశస్థులు మోషేతో ఇలా అన్నారు: “నీ సేవకులమైన మేము మా ప్రభువు ఆజ్ఞాపిస్తున్నట్టే చేస్తాం. 26 మా పిల్లలు, మా భార్యలు గిలాదు నగరాల్లో ఉంటారు; మా పశువులు, మా సాధు జంతువులన్నీ అక్కడే ఉంటాయి.+ 27 అయితే నీ సేవకులమైన మేము, అంటే యెహోవా ముందు యుద్ధం చేయడానికి ఆయుధాలు చేపట్టిన ప్రతీ ఒక్కరం మా ప్రభువు చెప్తున్నట్టే యొర్దాను నది దాటుతాం.”+
28 కాబట్టి మోషే వాళ్ల గురించి యాజకుడైన ఎలియాజరుకు, నూను కుమారుడు యెహోషువకు, అలాగే ఇశ్రాయేలు గోత్రాల పూర్వీకుల కుటుంబాల పెద్దలకు ఆజ్ఞ ఇచ్చాడు. 29 మోషే వాళ్లతో ఇలా అన్నాడు: “గాదు వంశస్థుల్లో, రూబేను వంశస్థుల్లో యెహోవా ముందు యుద్ధం చేయడానికి ఆయుధాలు చేపట్టిన ప్రతీ ఒక్కరు మీతోపాటు యొర్దాను నది దాటితే, అలాగే ఆ దేశం మీ స్వాధీనమైతే, గిలాదు ప్రదేశాన్ని మీరు వాళ్లకు సొత్తుగా ఇవ్వాలి.+ 30 ఒకవేళ వాళ్లు ఆయుధాలు చేపట్టి మీతోపాటు యొర్దాను నది దాటకపోతే, అప్పుడు వాళ్లు కూడా మీతోపాటు కనాను దేశంలో స్థిరపడతారు.”
31 అప్పుడు గాదు వంశస్థులు, రూబేను వంశస్థులు ఇలా అన్నారు: “నీ సేవకులమైన మాతో యెహోవా చెప్పినట్టే మేము చేస్తాం. 32 మేము ఆయుధాలు చేపట్టి యెహోవా ఎదుట యొర్దాను నది దాటి కనాను దేశంలోకి వెళ్తాం,+ అయితే మేము పొందబోయే స్వాస్థ్యం మాత్రం యొర్దాను నదికి ఇవతలి వైపే ఉంటుంది.” 33 కాబట్టి మోషే వాళ్లకు, అంటే గాదు వంశస్థులకు, రూబేను వంశస్థులకు,+ యోసేపు కుమారుడైన మనష్షే అర్ధగోత్రం వాళ్లకు+ అమోరీయుల రాజైన సీహోను రాజ్యాన్ని,+ బాషాను రాజైన ఓగు రాజ్యాన్ని,+ వాటిలోని నగరాల్ని, వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లోని నగరాల్ని ఇచ్చాడు.
34 గాదు వంశస్థులు వీటిని కట్టారు:* దీబోను,+ అతారోతు,+ అరోయేరు,+ 35 అత్రోతు-షోపాను, యాజెరు,+ యొగ్బెహ,+ 36 బేత్నిమ్రా,+ బేత్-హారాను.+ ఇవన్నీ ప్రాకారాలున్న నగరాలు. అలాగే వాళ్లు తమ మందల కోసం రాతి దొడ్లను కూడా కట్టారు. 37 రూబేను వంశస్థులు వీటిని కట్టారు: హెష్బోను,+ ఏలాలే,+ కిర్యతాయిము,+ 38 నెబో, బయల్మెయోను+ (వీటి పేర్లు మారాయి), అలాగే సిబ్మా; తర్వాత వాళ్లు తాము తిరిగి కట్టిన నగరాలకు కొత్త పేర్లు పెట్టారు.
39 మనష్షే కుమారుడైన మాకీరు వంశస్థులు గిలాదు మీదికి వెళ్లి, దాన్ని ఆక్రమించుకొని, అందులో ఉన్న అమోరీయుల్ని వెళ్లగొట్టారు. 40 కాబట్టి మోషే, మనష్షే కుమారుడైన మాకీరు వంశస్థులకు గిలాదును ఇచ్చాడు, దాంతో వాళ్లు అక్కడ నివసించడం మొదలుపెట్టారు.+ 41 మనష్షే వంశస్థుడైన యాయీరు వాళ్ల మీదికి వెళ్లి, గిలాదు ప్రాంతంలో ఉన్న గ్రామాల్ని ఆక్రమించుకొని, వాటికి హవోత్-యాయీరు* అని పేరు పెట్టాడు.+ 42 నోబహు కెనాతు మీదికి వెళ్లి దాన్ని, దాని చుట్టుపక్కల పట్టణాల్ని ఆక్రమించుకొని, దానికి నోబహు అని తన పేరే పెట్టాడు.