భాగం 8
దేవుని సంకల్పం నెరవేర్పు దిశగా పయనిస్తోంది
1, 2. బాధనుతొలగించే ఏర్పాటును దేవుడు ఎలా చేస్తూవచ్చాడు?
తిరుగుబాటు దారులైన మానవుల పాలన, దయ్యముల పాలన మానవ కుటుంబాన్ని అనేక శతాబ్దముల నుండి అధోగతికి ఈడ్చుకొని పోతున్నది. అయినా, దేవుడు మన బాధలను అలక్ష్యము చేయలేదు. ఈ శతాబ్దాలన్నింటిలో దుష్టత్వం, బాధల కబంధహస్తాలనుండి మానవులను విడిపించుటకు ఆయన ఏర్పాటు చేస్తూవచ్చాడు.
2 ఏదెనులో తిరుగుబాటు జరిగిన సమయాన, ప్రజల కొరకు ఈ భూమిని పరదైసు గృహముగా చేయగల్గే ప్రభుత్వాన్ని స్థాపించుటను గూర్చిన తన సంకల్పాన్ని దేవుడు బయలుపర్చాడు. (ఆదికాండము 3:15) పిమ్మట, దేవుని ప్రభుత్వాన్ని తన బోధలో ప్రధానాంశముగా చేశాడు. అది మానవజాతికి ఏకైక నిరీక్షణ అవుతుందని ఆయన చెప్పాడు.—దానియేలు 2:44; మత్తయి 6:9, 10; 12:21.
3. భూమి కొరకు రానైయున్న ప్రభుత్వాన్ని యేసు ఏమని పిలిచాడు, ఎందుకు?
3 రానైయున్న దేవుని రాజ్యం పరలోకం నుండి పాలించవలసి యున్నది గనుక యేసు దానిని ‘‘పరలోకరాజ్యము” అని పిలిచాడు. (మత్తయి 4:17) దేవుడే దానికి కారకుడు గనుక యేసు దానిని ‘‘దేవుని రాజ్యము” అని కూడ పిలిచాడు. (లూకా 17:20) ఆ ప్రభుత్వపాలకులను గూర్చి అది సాధించనైయున్న వాటిని గూర్చిన ప్రవచనాలను వ్రాయుటకు అనేక శతాబ్దాలనుండి దేవుడు తన రచయితలను ప్రేరేపించాడు.
భూమికి క్రొత్తరాజు
4, 5. యేసు తానంగీకరించిన రాజని దేవుడెట్లు చూపాడు?
4 దేవుని రాజ్యమునకు రాజైయుండే వ్యక్తికి సంబంధించిన అనేకప్రవచనాలను దాదాపు రెండువేల సంవత్సరాల క్రితం యేసు నెరవేర్చాడు. ఆయనే మానవులపై ఆ పరలోక పాలకునిగా దేవుని ఎంపికకు తగిన వాడనని నిరూపించుకొన్నాడు. ఆయన మరణించిన తరువాత దేవుడాయనను శక్తివంతమైన అమర్త్యుడగు ఆత్మీయప్రాణిగా పరలోకజీవమునకు పునరుత్థానము చేశాడు. ఆయన పునరుత్థానమునకు అనేకమంది సాక్షులుండిరి.—అపొస్తలుల కార్యములు 4:10; 9:1-9; రోమీయులు 1:1-4; 1 కొరింథీయులు 15:3-8.
5 అప్పుడు యేసు ‘‘దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను.” (హెబ్రీయులు 10:12) దేవుని పరలోక రాజుగా దేవుడు ఆయనకు అధికారమిచ్చేంతవరకు ఆయన అచ్చట వేచియుండెను. అది కీర్తన 110:1 నందలి ప్రవచనాన్ని నెరవేర్చింది. అచ్చట ఆయనను గూర్చి దేవుడిలా సెలవిచ్చాడు: ‘‘నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము.”
6. యేసు, దేవుని రాజ్యానికి తాను రాజుగానుండుటకు అర్హుడేనని ఎలా చూపాడు?
6 యేసు భూమి మీదనుండగా అట్టి స్థానానికి తాను అర్హుడని చూపించెను. హింస ఉన్నను దేవుని ఎడల తన యథార్థతను నిలుపుకొనుటకు ఆయన ఎంచుకున్నాడు. అలాచేయుట మూలంగా, పరీక్షింపబడినప్పుడు ఏ మానవుడు దేవునికి నమ్మకముగా వుండలేడని చెప్పిన సాతానును అబద్ధికుడని ఆయన నిరూపించాడు. పరిపూర్ణ మానవులను సృజించుటలో దేవుడు పొరపాటు చేయలేదని పరిపూర్ణ మానవుడును, ‘కడపటి ఆదాము’ అయిన యేసు చూపించెను.—1 కొరింథీయులు 15:22, 45; మత్తయి 4:1-11.
7, 8. యేసు భూమి మీద ఉన్నపుడు ఎటువంటి మంచిపనులు చేశాడు, ఏమి ప్రదర్శించి చూపాడు?
7 యేసు తన కొద్దిసంవత్సరాల పరిచర్యకాలంలో చేసినటువంటి మంచి పనులను ఏ పాలకుడైనా ఎప్పుడైనా చేశాడా? దేవుని పరిశుద్ధాత్మ శక్తిపూర్ణుడై యేసు రోగులను, అవిటివారిని, చెవిటివారిని, మూగవారిని స్వస్థపరచాడు. మృతులను సహితం లేపాడు. తాను సర్వాధికారంతో వచ్చునప్పుడు మానవుల కొరకు భూగోళమంతట తానుచేయబోవు దానిని స్వల్ప పరిమాణములో ప్రదర్శించి చూపాడు.—మత్తయి 15:30, 31; లూకా 7:11-16.
8 యేసు భూమిపై ఉన్నపుడు చాలామంచి పనులు చేశాడు, ఆయనను గూర్చి శిష్యుడైన యోహాను యిలాచెప్పాడు: “యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసినయెడల అట్లువ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది.”—యోహాను 21:25.a
9. యథార్థహృదయులైన ప్రజలు యేసునొద్దకు ఎందుకు వచ్చారు?
9 యేసు ప్రజలయెడల మిక్కుటమైన ప్రేమ, దయాకనికరములు గలవాడై యుండెను. పేదవారికి, అణగారిన వారికి ఆయన సహాయం చేశాడు. అయితే ధనికులు, ఉన్నత పదవులందున్న వారియెడల ఆయన వివక్షత చూపలేదు. యేసు యిచ్చిన ఈ ఆహ్వానమునకు యథార్థహృదయులైన వారు స్పందించారు, ఆయన ఇట్లనెను: ‘‘ప్రయాసపడి భారం మోసికొనుచున్న సమస్త జనులారా, నాయొద్దకురండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వీకుడను దీనమనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడిఎత్తుకొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.” (మత్తయి 11:28-30) దైవభయముగల వ్యక్తులు ఆయన యొద్దకువచ్చి, ఆయన పాలనకొరకు ఎదురు చూశారు.—యోహాను 12:19.
సహపాలకులు
10, 11. భూమిని పాలించుటలో యేసుతోపాటు ఎవరు పాలుపంచుకొంటారు?
10 మానవప్రభుత్వాలకు సహ కార్యనిర్వాహకులున్నట్లే దేవుని పరలోక రాజ్యానికి కూడ ఉంటారు. యేసుతోపాటు యితరులు భూపాలనలో పాలుపంచుకుంటారు, ఎందుకంటె యేసు తన సన్నిహిత సహచరులతో వారు తనతోపాటు రాజులుగా మానవులపై పాలన చేస్తారని వాగ్దానం చేశాడు.—యోహాను 14:2, 3; ప్రకటన 5:10; 20:6.
11 కనుక, యేసుతోపాటు పరిమిత సంఖ్యలో మానవులుకూడ పరలోకజీవము కొరకు పునరుత్థానులౌతారు. వారు మానవజాతికి శాశ్వత ఆశీర్వాదములను తెచ్చే దేవుని రాజ్యముగా తయారౌతారు. (2 కొరింథీయులు 4:14; ప్రకటన 14:1-3) మానవ కుటుంబానికి శాశ్వత ఆశీర్వాదములను తెచ్చు పాలన నిమిత్తం యెహోవా అనేక యుగములనుండి రంగం సిద్ధంచేశాడు.
స్వతంత్ర పాలన అంతం కానైయున్నది
12, 13. దేవుని రాజ్యమిప్పుడు ఏమి చేయుటకు సన్నద్ధమైయున్నది?
12 ఈ శతాబ్దంలో దేవుడు భూవ్యవహారములందు ప్రత్యక్షంగా కలుగజేసుకొంటున్నాడు. ఈ బ్రోషర్నందలి 9 వ భాగం చర్చించునట్లు, క్రీస్తు ఆధ్వర్యమున దేవుని రాజ్యం 1914 లో స్థాపించబడి, సాతాను విధానమంతటిని నలుగగొట్టుటకిప్పుడు సన్నద్ధమైయున్నదని బైబిలు ప్రవచనాలు చూపుచున్నవి. ఆ రాజ్యమిప్పుడు ‘‘[క్రీస్తు] శత్రువుల మధ్యను పరిపాలనా” చర్యగైకొనుటకు సిద్ధంగా ఉన్నది.—కీర్తన 110:2.
13 ఈ విషయమై దానియేలు 2:44 నందలి ప్రవచనమిట్లంటున్నది: ‘‘ఆ రాజుల [ప్రస్తుతమున్న] కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును [పరలోకములో] స్థాపించును; అది ఎన్నటికిని నాశనము కాదు లేక దాని సర్వాధిపత్యము మరొకరికి విడువబడదు [మానవ పరిపాలన యిక ఎన్నటికి అనుమతించబడదు]. అది [దేవుని రాజ్యము] ఈ రాజ్యములన్నిటిని తునాతునకలు చేసి వాటిని అంతము చేయును. అది నిరంతరం నిలుచును.’’—రివైజ్డ్ స్టాండర్డ్ వర్హన్.
14. మానవపాలన అంతమైపోవుట వలన కలిగేకొన్ని ప్రయోజనములేమిటి?
14 దేవునినుండి వేరైన పరిపాలనలన్నీ తీసివేయబడుటతో దేవుని రాజ్యము భూమియంతటిని పాలించుట సంపూర్ణమగును. ఆ రాజ్యము పరలోకమునుండి పాలించును గనుక మానవులచే అది ఎన్నటికి కలుషితం చేయబడదు. పాలించే అధికారం మొదట్లో ఎచ్చటఉండెనో అచ్చటనే, పరలోకమందే దేవుని యొద్ద ఉంటుంది. దేవునిపాలన భూమినంతటిని స్వాధీనపరచుకొంటుంది గనుక, అబద్దమతములవల్ల లేదా అసంతృప్తికరమైన మానవ తత్వముల వలన, రాజకీయ సిద్ధాంతముల వలన యిక ఎవ్వరు వంచింపబడరు. వాటిలో ఏ ఒక్కటీ ఉండటానికి అనుమతించబడదు.—మత్తయి 7:15-23; ప్రకటన 17 నుండి 19 అధ్యాయములు.
[అధస్సూచీలు]
a యేసు జీవితాన్నిగూర్చిన పూర్తివృత్తాంతము కొరకు వాచ్టవర్ సొసైటిచే 1991 లో ప్రచురించబడిన జీవించినవారిలోకెల్ల మహాగొప్ప మనిషి అనేపుస్తకాన్ని చూడండి.
[18 వ పేజీలోని చిత్రం]
యేసు నూతన లోకంలో ఏమి చేయనైయున్నాడో చూపేందుకు తాను భూమిమీదనుండగా రోగులను స్వస్థపరచి, మృతులను లేపాడు
[19 వ పేజీలోని చిత్రం]
దేవుని పరలోక రాజ్యము ఆయన నుండి వైదొలగిన సకల విధముల పాలనలను సమూలంగా నాశనము చేయును