32వ అధ్యాయం
విశ్రాంతి రోజున ఏం చేయడం సరైనది?
మత్తయి 12:9-14 మార్కు 3:1-6 లూకా 6:6-11
విశ్రాంతి రోజున యేసు ఒక వ్యక్తి చెయ్యి బాగుచేశాడు
మరో విశ్రాంతి రోజున యేసు ఒక సమాజమందిరానికి వెళ్లాడు, బహుశా అది గలిలయలో ఉండివుంటుంది. అక్కడ, కుడిచెయ్యి ఎండిపోయిన ఒక వ్యక్తి ఆయనకు కనిపించాడు. (లూకా 6:6) శాస్త్రులు, పరిసయ్యులు యేసును జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఎందుకు? వాళ్లు యేసును, “విశ్రాంతి రోజున బాగుచేయడం సరైనదేనా?” అని అడిగారు. అలా వాళ్ల అసలు ఉద్దేశం బయటపడింది.—మత్తయి 12:10.
ప్రాణం పోయే పరిస్థితుల్లో మాత్రమే విశ్రాంతి రోజున బాగుచేయడం సరైనదని యూదా మతనాయకులు నమ్మేవాళ్లు. వాళ్ల దృష్టిలో ప్రాణాపాయం లేని పరిస్థితుల్లో బాగుచేయడం, అంటే విరిగిన ఎముకను సరిచేయడం, బెణికినదానికి కట్టు కట్టడం లాంటివి విశ్రాంతి రోజున తప్పు. కాబట్టి శాస్త్రులు, పరిసయ్యులు దయనీయ స్థితిలో ఉన్న ఆ వ్యక్తి మీద నిజంగా శ్రద్ధ ఉండి ఆ ప్రశ్న అడగలేదని స్పష్టమౌతోంది. బదులుగా, వాళ్లు యేసును తప్పుపట్టడానికి కారణం వెతుకుతున్నారు.
అయితే, యేసుకు వాళ్ల వంకర బుద్ధి తెలుసు. విశ్రాంతి రోజున పని చేయకూడదనే ఆజ్ఞ విషయంలో వాళ్లకు ఎలాంటి విపరీతమైన, లేఖన విరుద్ధమైన ఆలోచన ఉందో యేసుకు అర్థమైంది. (నిర్గమకాండం 20:8-10) యేసు మంచి పనులు చేసినందుకు అప్పటికే విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు, చెయ్యి ఎండిపోయిన వ్యక్తితో, “లేచి మధ్యలోకి వచ్చి నిలబడు” అని చెప్పడం ద్వారా యేసు వాళ్లకు జవాబివ్వడానికి రంగం సిద్ధం చేశాడు.—మార్కు 3:3.
ఆయన శాస్త్రుల, పరిసయ్యుల వైపు తిరిగి ఇలా అన్నాడు: “మీలో ఎవరికైనా ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి రోజున గుంటలో పడిపోతే, మీరు దాన్ని పట్టుకొని పైకి తీయరా?” (మత్తయి 12:11) వాళ్లు గొర్రెల్ని ఆస్తిలా చూస్తారు కాబట్టి, అది గుంటలో పడితే మరుసటి రోజు వరకు దాన్ని అందులో విడిచిపెట్టరు; అలా వదిలేస్తే, బహుశా అది చనిపోయి వాళ్లకు నష్టం రావచ్చు. అంతేకాదు, లేఖనాలు ఇలా చెప్తున్నాయి: “నీతిమంతుడు తన పశువుల బాగోగులు చూసుకుంటాడు.”—సామెతలు 12:10.
గొర్రెల ఉదాహరణను అన్వయిస్తూ, యేసు ఇలా అన్నాడు: “గొర్రె కన్నా మనిషి ఇంకెంత విలువైనవాడు! కాబట్టి విశ్రాంతి రోజున మంచిపని చేయడం సరైనదే.” (మత్తయి 12:12) అవును, ఆ వ్యక్తిని బాగుచేస్తే యేసు విశ్రాంతి రోజు గురించిన నియమాన్ని మీరినట్టు అవ్వదు. కనికరం ఉట్టిపడే ఆ చక్కని తర్కాన్ని తిప్పికొట్టలేక మతనాయకులు మౌనంగా ఉండిపోయారు.
వాళ్ల తప్పుడు ఆలోచనను బట్టి యేసుకు కోపం, బాధ కలిగాయి. ఆయన ఒకసారి చుట్టూ చూసి, తర్వాత ఆ వ్యక్తితో, “నీ చెయ్యి చాపు” అన్నాడు. (మత్తయి 12:13) అతను చెయ్యి చాపగానే అది బాగైంది. అప్పుడు అతను చాలా సంతోషించాడు. మరి యేసును ఇరకాటంలో పడేయాలని చూసినవాళ్లు ఎలా స్పందించారు?
అతని చెయ్యి బాగైనందుకు సంతోషించాల్సిందిపోయి ఆ పరిసయ్యులు బయటికి వెళ్లి, వెంటనే హేరోదు అనుచరులతో కలిసి “యేసును చంపడానికి” కుట్రపన్నారు. (మార్కు 3:6) హేరోదు అనుచరుల రాజకీయ గుంపులో సద్దూకయ్యుల మత గుంపుకు చెందిన కొంతమంది కూడా ఉండివుంటారు. సాధారణంగా సద్దూకయ్యులకు, పరిసయ్యులకు ఒకరంటే ఒకరికి పడదు. కానీ యేసును వ్యతిరేకించే విషయంలో వాళ్లు ఒక్కటయ్యారు.