ముఖపత్ర అంశం | చనిపోతే ఇక అంతా అయిపోయినట్లేనా?
చనిపోతే అంతా అయిపోయినట్లు కాదు!
యెరూషలేముకు దాదాపు 3 కి.మీ. దూరంలో బేతనియ అనే కుగ్రామం ఉండేది. (యోహాను 11:18) యేసు చనిపోవడానికి కొన్ని వారాల ముందు, అక్కడ ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. యేసు ప్రాణ స్నేహితుడు ఒకరు ఉన్నట్టుండి తీవ్రంగా జబ్బుపడి చనిపోయాడు, ఆయనే లాజరు.
యేసు ఆ వార్త వినగానే లాజరు ‘నిద్రిస్తున్నాడని,’ ఆయనను లేపడానికి వెళ్తున్నానని తన శిష్యులతో అన్నాడు. (యోహాను 11:11) అయితే యేసు మాటలు శిష్యులకు సరిగ్గా అర్థంకాలేదు. దాంతో యేసు సూటిగా ఇలా చెప్పాడు: “లాజరు చనిపోయెను.”—యోహాను 11:14, 15.
లాజరును సమాధి చేసిన నాలుగు రోజుల తర్వాత యేసు బేతనియకు వచ్చి, లాజరు సహోదరియైన మార్తను ఓదార్చడానికి ప్రయత్నించాడు. అప్పుడు మార్త యేసుతో ఇలా అంది: “నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండును.” (యోహాను 11:17, 21) అందుకు యేసు ఆమెతో ఇలా అన్నాడు: “పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును.”—యోహాను 11:25.
‘లాజరూ, బయటికి రమ్ము!’
యేసు, ఆ వాగ్దానం నిజమని చూపించడానికి, లాజరు సమాధి దగ్గరకు వెళ్లి “లాజరూ, బయటికి రమ్ము” అని గట్టిగా పిలిచాడు. (యోహాను 11:43) దాంతో, చనిపోయిన లాజరు బయటకు వచ్చేశాడు. అది చూసినవాళ్లు తమ కళ్లను తామే నమ్మలేకపోయారు.
ఇంతకుముందు కూడా, చనిపోయిన ఇద్దరిని యేసు బ్రతికించాడు. వాళ్లలో ఒకరు, యాయీరు కుమార్తె. ఆమె చాలా చిన్న అమ్మాయి. ఆమెను బ్రతికించే ముందు కూడా యేసు, తను నిద్రిస్తోందని అన్నాడు.—లూకా 8:52.
యేసు ఈ రెండు సందర్భాల్లోనూ మరణాన్ని నిద్రతో పోల్చాడని గమనించండి. ఆ పోలిక సరైనదే. ఎలా? నిద్రపోయే వాళ్లకు తమ చుట్టూ ఏమి జరుగుతుందో తెలీదు. అలాగే, చనిపోయినవాళ్లకు కూడా నొప్పి, బాధ తెలియవు. (ప్రసంగి 9:5; “మరణం గాఢనిద్ర లాంటిది” అనే బాక్సు చూడండి.) చనిపోయినవాళ్ల అసలు స్థితిని యేసు తొలి శిష్యులు స్పష్టంగా అర్థంచేసుకున్నారు. ఎన్సైక్లోపీడియా ఆఫ్ రిలీజియన్ అండ్ ఎథిక్స్ ఇలా చెబుతుంది: “చనిపోయే వరకూ విశ్వాసం చూపించినవాళ్లకు మరణం నిద్ర లాంటిదని, సమాధి విశ్రాంతి స్థలం . . . లాంటిదని యేసు అనుచరులు భావించేవాళ్లు.”a
చనిపోయినవాళ్లు సమాధిలో విశ్రాంతి తీసుకుంటున్నారు కానీ బాధపడడంలేదని తెలుసుకోవడం మనకెంతో ఊరటనిస్తుంది. చనిపోయినప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలుసు కాబట్టి ఈ విషయంలో మనం భయపడుతూ ఉండనవసరం లేదు.
“మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా?”
రాత్రిపూట చక్కగా విశ్రాంతి తీసుకోవడం అందరికీ ఇష్టమే. అంతమాత్రాన, శాశ్వత నిద్రలోకి జారుకోవాలని ఎవరు మాత్రం కోరుకుంటారు? ఇప్పుడు సమాధిలో నిద్రిస్తున్నవాళ్లు కూడా లాజరులా, యాయీరు కుమార్తెలా మళ్లీ బ్రతుకుతారని నమ్మడానికి ఆధారమేమిటి?
తాను మరణం ముంగిట్లోకి వచ్చానని అనిపించినప్పుడు పూర్వీకుడైన యోబు కూడా అలాంటి ప్రశ్నే వేశాడు? “మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా?” అని ఆయన అడిగాడు.—యోబు 14:14.
తన ప్రశ్నకు తానే జవాబిస్తూ యోబు యెహోవాతో ఇలా అన్నాడు: “నీవు పిలిచెదవు నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును.” (యోబు 14:15) నమ్మకమైన తన సేవకులను మళ్లీ బ్రతికించే రోజు కోసం యెహోవా ఎంతో ఎదురుచూస్తున్నాడని యోబుకు అనిపించింది. యోబు అసాధ్యమైన దాన్ని కోరుకుంటున్నాడా? కానేకాదు.
యేసు చేసిన పునరుత్థానాలు, దేవుడు ఆయనకు మరణాన్ని జయించే శక్తి ఇచ్చాడని చూపిస్తున్నాయి. ఇప్పుడైతే, ఏకంగా “మరణముయొక్క . . . తాళపుచెవులు” యేసు దగ్గర ఉన్నాయని బైబిలు చెబుతుంది. (ప్రకటన 1:18) లాజరును బ్రతికించినట్లే, భవిష్యత్తులో కూడా ప్రజలను మళ్లీ బ్రతికించే అధికారం యేసుకు ఉందని దానర్థం.
పునరుత్థానం జరుగుతుందనే వాగ్దానం గురించి బైబిలు పదేపదే చెబుతుంది. ఒక దూత, దానియేలు ప్రవక్తకు ఇలా అభయమిచ్చాడు: “నీవు . . . విశ్రాంతినొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు.” (దానియేలు 12:13) సద్దూకయ్యులనే యూదా మతనాయకులు పునరుత్థానం జరగదని నమ్మేవాళ్లు. యేసు ఒకసారి వాళ్లతో ఇలా అన్నాడు: “లేఖనములనుగాని దేవుని శక్తినిగాని ఎరుగక మీరు పొరబడుచున్నారు.” (మత్తయి 22:23, 29) అలాగే, అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: ‘నీతిమంతులకు, అనీతిమంతులకు పునరుత్థానం కలుగబోవుచున్నదని నేను దేవునియందు నిరీక్షణ ఉంచియున్నాను.’—అపొస్తలుల కార్యములు 24:14, 15.
చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతికేది ఎప్పుడు?
పౌలు చెప్పినట్లు నీతిమంతులు, అనీతిమంతులు పునరుత్థానం అయ్యేది ఎప్పుడు? నీతిమంతుడైన దానియేలు, “కాలాంతమందు” మళ్లీ బ్రతుకుతాడని దూత ఆయనకు చెప్పాడు. మార్త కూడా తన సహోదరుడు లాజరు “అంత్యదినమున పునరుత్థానమందు లేచునని” నమ్మింది.—యోహాను 11:24.
బైబిలు ఈ “అంత్యదినమును” క్రీస్తు రాజ్యపరిపాలనతో ముడిపెడుతోంది. పౌలు ఇలా రాశాడు: “తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన [క్రీస్తు] రాజ్యపరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము.” (1 కొరింథీయులు 15:25, 26) దేవుని రాజ్యం రావాలని, భూమి విషయంలో ఆయన చిత్తం నెరవేరాలని మనం ప్రార్థించడానికి ఇదొక బలమైన కారణం.b
చనిపోయినవాళ్లను మళ్లీ బ్రతికించాలనేది దేవుని చిత్తం, ఈ విషయం యోబుకు బాగా తెలుసు. ఆ సమయం వచ్చినప్పుడు నిజంగానే మరణం ఇక ఉండదు. ‘చనిపోతే ఇక అంతా అయిపోయినట్లేనా?’ అనే ప్రశ్న ఇక ఎవ్వరి మనసులోనూ తలెత్తదు. (w14-E 01/01)
a “Cemetery” (శ్మశానవాటిక) అనే ఇంగ్లీషు పదం, “నిద్రించే స్థలం” అనే అర్థమున్న గ్రీకు పదం నుండి వచ్చింది.
b దేవుని రాజ్యం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే, యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని 8వ అధ్యాయం చూడండి.