యోహాను సువార్త
20 వారం మొదటి రోజున* ఇంకా తెల్లవారకముందే మగ్దలేనే మరియ సమాధి* దగ్గరికి వచ్చింది.+ అయితే అప్పటికే సమాధికి* ఉన్న రాయి దొర్లించబడి ఉండడం ఆమె చూసింది.+ 2 దాంతో ఆమె పరుగెత్తుకుంటూ సీమోను పేతురు దగ్గరికి, యేసు ప్రేమించిన ఇంకో శిష్యుడి+ దగ్గరికి వచ్చి, “వాళ్లు ప్రభువును సమాధిలో నుండి తీసుకెళ్లిపోయారు,+ ఆయన్ని ఎక్కడ ఉంచారో మాకు తెలీదు” అని చెప్పింది.
3 అప్పుడు పేతురు, ఆ ఇంకో శిష్యుడు సమాధి దగ్గరికి బయల్దేరారు. 4 వాళ్లిద్దరూ కలిసి పరుగెత్తడం మొదలుపెట్టారు, ఆ ఇంకో శిష్యుడు పేతురుకన్నా వేగంగా పరుగెత్తి సమాధి దగ్గరికి ముందుగా చేరుకున్నాడు. 5 అతను లోపలికి వంగి చూసినప్పుడు, అక్కడ నారవస్త్రాలు పడివున్నాయి.+ అయితే అతను లోపలికి వెళ్లలేదు. 6 అతని వెనక సీమోను పేతురు కూడా వచ్చాడు. అతను సమాధిలోకి వెళ్లి, అక్కడ నారవస్త్రాలు పడివుండడం చూశాడు. 7 యేసు తలకు చుట్టబడిన నారవస్త్రం మిగతా నారవస్త్రాల దగ్గర లేదు. అది చుట్టబడి వేరే చోట ఉంది. 8 అప్పుడు సమాధి దగ్గరికి ముందుగా చేరుకున్న శిష్యుడు కూడా లోపలికి వెళ్లి, చూసి, నమ్మాడు. 9 ఆయన మృతుల్లో నుండి లేస్తాడనే లేఖనాన్ని+ వాళ్లు అప్పటికి ఇంకా అర్థంచేసుకోలేదు. 10 కాబట్టి శిష్యులు తమ ఇళ్లకు తిరిగెళ్లిపోయారు.
11 అయితే మరియ ఏడుస్తూ సమాధి బయటే నిలబడి ఉంది. ఆమె సమాధిలోకి వంగి చూసినప్పుడు, 12 యేసు శరీరం ఉంచబడిన చోట తెల్లని వస్త్రాలు వేసుకున్న ఇద్దరు దేవదూతలు+ ఆమెకు కనిపించారు. తలవైపు ఒక దూత, కాళ్లవైపు ఒక దూత కూర్చొని ఉన్నారు. 13 వాళ్లు ఆమెను, “ఎందుకు ఏడుస్తున్నావు?” అని అడిగారు. అప్పుడు ఆమె, “ఎవరో నా ప్రభువును తీసుకెళ్లిపోయారు, ఆయన్ని ఎక్కడ ఉంచారో నాకు తెలీదు” అంది. 14 ఆ మాట అని ఆమె వెనక్కి తిరిగి చూసింది. అక్కడ యేసు నిలబడివున్నాడు, కానీ ఆయన యేసని ఆమె గుర్తుపట్టలేదు.+ 15 యేసు ఆమెను, “అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరి కోసం వెదుకుతున్నావు?” అని అడిగాడు. ఆమె ఆయన్ని తోటమాలి అనుకుని, “అయ్యా, నువ్వు ఆయన్ని తీసుకెళ్లివుంటే ఆయన్ని ఎక్కడ ఉంచావో చెప్పు. నేను ఆయన్ని తీసుకెళ్తాను” అంది. 16 అప్పుడు యేసు, “మరియా!” అన్నాడు. ఆమె వెనక్కి తిరిగి హీబ్రూ భాషలో, “రబ్బోనీ!” (అంటే “బోధకుడా!” అని అర్థం) అని పిలిచింది. 17 యేసు ఆమెతో ఇలా అన్నాడు: “నేనింకా తండ్రి దగ్గరికి వెళ్లలేదు కాబట్టి నన్ను అలాగే పట్టుకుని ఉండవద్దు. అయితే, నా సహోదరుల దగ్గరికి వెళ్లి,+ ‘నా తండ్రీ మీ తండ్రీ, నా దేవుడూ+ మీ దేవుడూ అయిన ఆయన దగ్గరికి నేను వెళ్తున్నాను’+ అని చెప్పు.” 18 మగ్దలేనే మరియ వెళ్లి, “నేను ప్రభువును చూశాను!” అని శిష్యులతో చెప్పింది. అంతేకాదు, యేసు తనకు ఏంచెప్పాడో వాళ్లకు తెలియజేసింది.+
19 వారం మొదటి రోజైన ఆ రోజు సాయంత్రం యేసు శిష్యులు ఒక ఇంట్లో కలుసుకున్నారు; వాళ్లు యూదులకు భయపడి తలుపులు గట్టిగా వేసుకున్నారు. అప్పుడు యేసు వచ్చి వాళ్ల మధ్యలో నిలబడి, “మీకు శాంతి కలగాలి”+ అన్నాడు. 20 ఆ మాట అన్న తర్వాత ఆయన తన చేతుల్ని, తన పక్కభాగాన్ని వాళ్లకు చూపించాడు.+ అప్పుడు శిష్యులు ప్రభువును చూసి ఎంతో సంతోషించారు.+ 21 యేసు మళ్లీ వాళ్లతో, “మీకు శాంతి కలగాలి.+ తండ్రి నన్ను పంపించినట్టే+ నేను కూడా మిమ్మల్ని పంపిస్తున్నాను”+ అన్నాడు. 22 ఆ మాటలు అన్న తర్వాత యేసు వాళ్ల మీద ఊది ఇలా అన్నాడు: “పవిత్రశక్తిని పొందండి.+ 23 మీరు ఎవరి పాపాలనైనా క్షమిస్తే, వాళ్ల పాపాలు అప్పటికే క్షమించబడ్డాయి. మీరు ఎవరి పాపాలనైనా క్షమించకపోతే అవి అలాగే నిలిచివున్నాయి.”
24 యేసు వచ్చినప్పుడు పన్నెండుమందిలో ఒకడైన తోమా+ వాళ్లతోపాటు లేడు. అతనికి దిదుమ అనే పేరు కూడా ఉంది. 25 కాబట్టి మిగతా శిష్యులు అతనితో, “మేము ప్రభువును చూశాం!” అని చెప్పారు. అయితే తోమా వాళ్లతో, “నేను ఆయన చేతుల్లోని మేకుల గాయాల్ని చూసి, వాటిని నా వేలితో ముట్టుకుని, ఆయన పక్కభాగంలో నా చేతిని ఉంచితేనేగానీ+ నమ్మను” అన్నాడు.
26 ఎనిమిది రోజుల తర్వాత ఆయన శిష్యులు మళ్లీ ఇంట్లో కలుసుకున్నారు, అప్పుడు తోమా కూడా వాళ్లతో ఉన్నాడు. తలుపులు మూసివున్నా యేసు వచ్చి వాళ్ల మధ్య నిలబడి, “మీకు శాంతి కలగాలి”+ అన్నాడు. 27 తర్వాత ఆయన తోమాతో, “నీ వేలితో నా చేతుల్ని ముట్టుకో. నీ చేతిని నా పక్కభాగంలో ఉంచు. ఇక సందేహపడడం మాని, నమ్ము” అన్నాడు. 28 అప్పుడు తోమా ఆయనతో, “నా ప్రభువా, నా దేవా!” అన్నాడు. 29 యేసు అతనితో, “నువ్వు నన్ను చూశావు కాబట్టి నమ్ముతున్నావా? చూడకుండానే నమ్మేవాళ్లు సంతోషంగా ఉంటారు” అన్నాడు.
30 నిజానికి యేసు, శిష్యుల ముందు ఇంకా చాలా అద్భుతాలు చేశాడు, కానీ అవి ఈ గ్రంథపు చుట్టలో రాయబడలేదు.+ 31 అయితే, యేసే దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మేలా, అలా నమ్మి ఆయన పేరు ద్వారా జీవం పొందేలా ఇవి రాయబడ్డాయి.+