లెసన్ 25
ఆరాధన కోసం గుడారం
మోషే సీనాయి కొండ మీద ఉన్నప్పుడు యెహోవా ఆయనతో ఒక ప్రత్యేకమైన డేరాను కట్టమని చెప్పాడు. దాన్ని గుడారం అని పిలిచారు. అక్కడ ఇశ్రాయేలీయులు యెహోవాను ఆరాధించవచ్చు. ఆ గుడారాన్ని వాళ్లు ఎక్కడికి వెళ్లినా తీసుకువెళ్లవచ్చు.
యెహోవా ఇలా అన్నాడు: ‘గుడారాన్ని కట్టడానికి ప్రజలు ఇవ్వగలిగే వేటినైనా ఇవ్వమని వాళ్లతో చెప్పు.’ ఇశ్రాయేలీయులు బంగారం, వెండి, రాగి, విలువైన రత్నాలు, ఆభరణాలు తెచ్చారు. ఊలు దారం, నార దారం, జంతువు చర్మాలు, ఇంకా ఎన్నో వస్తువుల్ని తెచ్చారు. వాళ్లు ఎంత ఉదారంగా ఇచ్చారంటే మోషే ‘సరిపోయాయి! ఇక తీసుకురాకండి’ అని చెప్పాల్సి వచ్చింది.
పనిని నేర్పుగా చేసే చాలామంది పురుషులు, స్త్రీలు గుడారాన్ని కట్టడానికి సహాయం చేశారు. ఆ పని చేయడానికి యెహోవా వాళ్లకు కావాల్సిన తెలివిని ఇచ్చాడు. కొంతమంది దారాన్ని అల్లారు, లేదా బట్టలు తయారు చేశారు లేదా అల్లికలు చేశారు. వేరేవాళ్లు రత్నాలతో అలంకరించారు, బంగారం పని చేశారు, చెక్కను చెక్కారు.
యెహోవా వాళ్లకు చెప్పినట్లే ప్రజలు గుడారాన్ని కట్టారు. ఒక అందమైన తెరతో వాళ్లు గుడారాన్ని రెండు భాగాలుగా వేరు చేశారు, ఒకటి పవిత్ర స్థలం ఇంకొకటి అతి పవిత్ర స్థలం. అతి పవిత్ర స్థలంలో బంగారం, తుమ్మ కర్రతో చేసిన ఒప్పంద మందసం ఉంది. పవిత్ర స్థలంలో బంగారు దీపస్తంభం, బల్ల, ధూపం వేయడానికి ఒక వేదిక ఉన్నాయి. గుడార ప్రాంగణంలో ఒక రాగి గంగాళం, ఒక పెద్ద బలిపీఠం ఉన్నాయి. ఒప్పంద మందసం యెహోవా మాట వింటారని ఇశ్రాయేలీయులు ఇచ్చిన మాటను వాళ్లకు గుర్తు చేసేది. ఒప్పందం అంటే ఏంటో మీకు తెలుసా? అది ఒక ప్రత్యేకమైన వాగ్దానం.
గుడారంలో యాజకులుగా పనిచేయడానికి యెహోవా అహరోనును అతని కొడుకులను ఎంచుకున్నాడు. వాళ్లు దాన్ని చూసుకుంటూ, అక్కడ యెహోవాకు అర్పణలు అర్పించాలి. ప్రధాన యాజకుడైన అహరోను ఒక్కడికే అతి పవిత్ర స్థలంలోకి వెళ్లే అనుమతి ఉంది. ఆయన అక్కడికి సంవత్సరానికి ఒక్కసారి వెళ్లి, తన పాపాల గురించి, తన కుటుంబం చేసిన పాపాల గురించి, ఇశ్రాయేలు ప్రజలు అందరు చేసిన పాపాల గురించి అర్పణ అర్పించేవాడు.
ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి వచ్చేసిన ఒక సంవత్సరంలో గుడారం కట్టడం పూర్తి చేశారు. యెహోవాను ఆరాధించడానికి వాళ్లకు ఇప్పుడు ఒక స్థలం ఉంది.
యెహోవా గుడారాన్ని తన మహిమతో నింపాడు. దానిపై ఒక మేఘం వచ్చేలా చేశాడు. ఆ మేఘం గుడారం మీద ఉన్నంతసేపు ఇశ్రాయేలీయులు ఉన్న చోటే ఉన్నారు. మేఘం పైకి లేస్తే వాళ్లు ఇక వేరే చోటుకు బయల్దేరాలని వాళ్లకు తెలిసేది. అప్పుడు వాళ్లు గుడారాన్ని ఊడదీసి మేఘం ఎటు వెళ్తుందో అటు వెళ్లేవాళ్లు.
“అప్పుడు సింహాసనం నుండి వచ్చిన ఒక పెద్ద స్వరం ఇలా చెప్పడం నేను విన్నాను: ‘ఇదిగో! దేవుని నివాసం మనుషులతో ఉంది. ఆయన వాళ్లతో పాటు నివసిస్తాడు. వాళ్లు ఆయన ప్రజలుగా ఉంటారు. దేవుడే స్వయంగా వాళ్లతోపాటు ఉంటాడు.’”—ప్రకటన 21:3