“ఇవి ఎప్పుడు జరుగును? . . . మాతో చెప్పుము”
“క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను, పుట్టకమునుపే వాటిని మీకు తెల్పుచున్నాను.”—యెషయా 42:9.
1, 2. (ఎ) యేసు అపొస్తలులు భవిష్యత్తును గూర్చి ఏమి అడిగారు? (బి) సంయుక్త సూచనను గూర్చి యేసు యిచ్చిన జవాబు ఎలా నెరవేరింది?
“ఆదినుండి . . . కలుగబోవువాటిని తెలియజేయుచున్న” యెహోవా దేవునినుండి దైవికబోధ ఉద్భవిస్తుంది. (యెషయా 46:10) “ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నియు నెరవేరబోవు కాలమునకు ఏ గురుతు కలుగును? అది మాతో చెప్పుమని” ప్రశ్నిస్తూ అపొస్తలులు యేసునుండి అలాంటి బోధను ఆశించారని దీనికి ముందున్న శీర్షిక చూపింది.—మార్కు 13:4.
2 దానికి జవాబుగా యేసు, యూదా మత విధానం త్వరలో అంతం కాబోతోందనే రుజువునిస్తూ అనేక సంఘటనలుగల ఒక సంయుక్త సూచననిచ్చాడు. ఇది సా.శ. 70లో యెరూషలేము నాశనంతో నెరవేరింది. అయితే కాలప్రవాహంలో అనేక సంవత్సరాల తర్వాత యేసు ప్రవచనం గొప్పగా నెరవేరుతుంది. ఒక్కసారి “అన్యజనముల కాలములు” 1914లో ముగిసినప్పుడు, త్వరలోనే “మహాశ్రమలందు” ప్రస్తుత దుష్టవిధానం అంతమౌతుందని ప్రదర్శించే సూచన విస్తృత స్థాయిలో కనబరచబడుతోంది.a (లూకా 21:24) మొదటి ప్రపంచ యుద్ధం, ఆలాగే ఈ 20వ శతాబ్దమందు జరిగిన అనేక విపత్కర సంఘటనలను బట్టి ఈ సూచన నెరవేరిందని నేడు జీవిస్తున్న లక్షలాదిమంది రూఢిగా చెప్పగలరు. సా.శ. 33 నుండి సా.శ. 70 మధ్యకాలంలో జరిగింది సాదృశ్యంగా చూపినట్లు, అటువంటి సంఘటనలు యేసు చెప్పిన ప్రవచన గొప్ప నెరవేర్పును కూడా గుర్తిస్తున్నాయి.
3. మరో సూచనను గూర్చి చెబుతూ యేసు ఏ అభివృద్ధినిగూర్చి ప్రవచించాడు?
3 అన్యజనముల కాలములను గూర్చి ప్రస్తావించిన తర్వాత, మత్తయి, మార్కు, సువార్తల్లోని వృత్తాంతాలు సంయుక్త సూచనను అదనంగా, యితర సంఘటనల పరంపరను “యుగసమాప్తికి” మరో “సూచనగా” వర్ణిస్తున్నాయి. (మత్తయి 24:3) (15వ పేజీ వృత్తాంతంలోని ఈ విషయాన్ని రెండు గీతలు సూచిస్తున్నాయి) మత్తయి యిలా అన్నాడు: “ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును. అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్పబూరతో తన దూతలను పంపును. వారు ఆకాశముయొక్క ఈ చివరనుండి ఆ చివరవరకు నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగుచేతురు.”—మత్తయి 24:29-31.
శ్రమ, అంతరిక్షంలో సంభ్రమాశ్చర్య సంఘటనలు
4. యేసు ప్రస్తావించిన అంతరిక్ష సంభ్రమాశ్చర్య సంఘటనలను గూర్చి ఏ ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి?
4 అది ఎప్పుడు నెరవేరుతుంది? మూడు సువార్తల వృత్తాంతాలు కూడ, అంతరిక్షంలో సంభ్రమాశ్చర్య సంఘటన అని మనం పిలువగలిగే సంఘటన అంటే సూర్యచంద్రులు చీకటి కమ్మడాన్ని, నక్షత్రాలు రాలిపోవడాన్ని గూర్చి ప్రస్తావించాయి. “శ్రమ” ముగిసిన వెంటనే యిది జరుగుతుందని యేసు చెప్పాడు. సా.శ. 70లో చరమస్థాయికి చేరిన శ్రమ యేసు మనస్సులో ఉందా లేక మన ఆధునిక కాలంలో యింకా భవిష్యత్తులో జరుగబోయే మహాశ్రమలను గూర్చి ఆయన మాట్లాడుతున్నాడా?—మత్తయి 24:29; మార్కు 13:24.
5. ఆధునిక కాలంలోని శ్రమనుగూర్చి ఒకప్పుడు ఏమని దృష్టించారు?
5 అన్యజనముల కాలములు 1914లో ముగిసినప్పటి నుండి, దేవుని ప్రజలు “మహాశ్రమల” విషయమై మిక్కిలి శ్రద్ధచూపారు. (ప్రకటన 7:14) ఆధునిక దిన మహా శ్రమలకు మొదటి భాగం మొదటి ప్రపంచ యుద్ధ కాలంతో సంబంధంకలిగి, కొద్ది కాలం విరామమైన తర్వాత, చివరి భాగంగా “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధము”తో ముగుస్తుందని వారు భావించారు. అదే నిజమైతే, “యుగసమాప్తి” మధ్యకాలంలో వచ్చే దశాబ్దాల్లో ఏమి జరుగుతుంది.—ప్రకటన 16:14; మత్తయి 13:39; 24:3; 28:20.
6. యేసు ప్రవచించిన అంతరిక్ష సంభ్రమాశ్చర్య సంఘటనలను గూర్చి ఏమి భావించారు?
6 దేవుడు సమకూర్చుకొన్న ప్రజల ప్రకటనాపనితో సహా, ఈ విరామసమయంలో సంయుక్త సూచన కనబడగలదని భావించారు. ప్రారంభ భాగమైన 1914-18 తర్వాత విరామ సమయంలో ప్రవచించబడిన అంతరిక్షంలో సంభ్రమాశ్చర్య సంఘటనలు జరుగుతాయని అనిపించింది. (మత్తయి 24:29; మార్కు 13:24, 25; లూకా 21:25) ఆకాశమందలి అక్షరార్థ విషయాలపై అంటే అంతరిక్ష శలాకలు, రాకెట్లు, కాస్మిక్ లేక గామా కిరణాలు, చంద్రునిపై దిగడం లేక స్థావరాలు ఏర్పాటు చేసుకోవడంపై అవధానం కేంద్రీకృతమైంది.
7. మహా శ్రమలను గూర్చిన ఏ సవరించబడిన భావం అందించబడింది?
7 అయినప్పటికి, 1970 జనవరి 15 ది వాచ్టవర్ యేసు ప్రవచనాన్ని, ప్రత్యేకంగా రాబోయే మహాశ్రమను పునఃపరిశీలించింది. మొదటి శతాబ్దంలో జరిగినదాని దృష్ట్యా, ఆధునిక దిన మహాశ్రమలు 1914-18 నందు ప్రారంభ భాగం మొదలై, శతాబ్దాల పొడవున కొనసాగిన విరామం తర్వాత మరలా ప్రారంభం కాదని అది చూపింది. ఆ పత్రిక యిలా ముగించింది: “ఇక ముందు ఎన్నడూ జరుగబోని ‘మహాశ్రమ’ భవిష్యత్తులో రానైయున్నది, ఎందుకంటే ప్రపంచ అబద్ధ మత సామ్రాజ్యం (క్రైస్తవ మతసామ్రాజ్యంతో సహా) నాశనమౌతుందని, అటు తర్వాత అర్మగెద్దోనునందు ‘సర్వోన్నతుడైన దేవుని మహా దినమున జరుగు యుద్ధము’ వస్తుందని దాని అర్థము.”
8. ఆధునిక కాల సవరించబడిన అభిప్రాయంతో, మత్తయి 24:29 ఎలా వివరించబడింది?
8 అయితే మత్తయి 24:29 “ఆ . . . శ్రమ ముగిసిన వెంటనే” అంతరిక్షంలో అట్టి సంభ్రమాశ్చర్య సంఘటనలు సంభవిస్తాయని చెబుతోంది. అదెలా సాధ్యం? ఇక్కడ చెప్పబడిన శ్రమ సా.శ. 70లో చరమస్థాయికి చేరినదేనని ది వాచ్టవర్ మే 1, 1975 సూచించింది. సా.శ. 70లోని సంఘటన “ముగిసిన వెంటనే” మనకాలమందలి ఈ అంతరిక్ష సంభ్రమాశ్చర్య సంఘటనలు జరుగుతాయని మనమెలా చెప్పగలం? దేవునికి శతాబ్దాల మధ్యకాలం అతిస్వల్ప కాలంగా ఉంటుందని తర్కించబడింది. (రోమీయులు 16:20; 2 పేతురు 3:8) అయితే, ఈ ప్రవచనాన్ని, ప్రత్యేకంగా మత్తయి 24:29-31 నందలి విషయాల్ని లోతుగా పరిశీలించడం దీనికి పూర్తి విరుద్ధమైన వివరణను సూచిస్తుంది. “పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు” వెలుగు ఎలా ప్రకాశిస్తుందో ఉదహరిస్తుంది. (సామెతలు 4:18)b ఒక క్రొత్త, లేక మార్పుచెందిన వివరణ ఎందుకు సమంజసమో మనం పరిశీలిద్దాము.
9. ఆకాశంలో జరిగే సంఘటనలను గూర్చి యేసు చెప్పిన మాటలకు హెబ్రీలేఖనాలు ఏ ఆధారాన్ని అందిస్తున్నాయి?
9 సూర్యుడు నల్లబడుటను, చంద్రుని చీకటికమ్ముట, నక్షత్రములు రాలుటను గూర్చిన ప్రవచానాన్ని యేసు తన నలుగురు అపొస్తలులకు చెప్పాడు. యూదులుగా వారు ఆ భాషా భావాన్ని హెబ్రీలేఖనాల నుండి గుర్తించగల్గుతారు, ఉదాహరణకు జెఫన్యా 1:15లో దేవుని తీర్పుకాలము “శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ముదినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ముదినము, మేఘములును గాఢాంధకారమును కమ్ముదినము” అని పిలువబడింది. హెబ్రీ ప్రవక్తలనేకులు కూడ సూర్యుడు నల్లబడునని, చంద్రుడు చీకటి కమ్మునని, నక్షత్రములు వెలుగియ్యవని వర్ణించారు. బబులోను, ఎదోము, ఐగుప్తు, ఇశ్రాయేలు ఉత్తరప్రాంత రాజ్యాలకు వ్యతిరేకంగా చేసిన దైవిక తీర్పుల్లో అటువంటి భాషాప్రయోగాన్నే మీరు కనుగొంటారు.—యెషయా 13:9, 10; 34:4, 5; యిర్మీయా 4:28; యెహెజ్కేలు 32:2, 6-8; ఆమోసు 5:20; 8:2, 9.
10, 11. (ఎ) ఆకాశంలోని విషయాలను గూర్చి యోవేలు ప్రవచనం ఏం చెబుతోంది? (బి) యోవేలు ప్రవచనంలో ఏ విషయాలు సా.శ. 33లో నెరవేరాయి, ఏవి నెరవేరలేదు?
10 యేసు చెప్పిన విషయాన్ని వారు విన్నప్పుడు, పేతురు ఆయనతో సహా మిగిలిన ముగ్గురు, యోవేలు 2:28-31; 3:15లోని ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకొనివుండవచ్చు. అక్కడిలావుంది: “నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు; . . . ఆకాశమందును భూమియందును మహాత్కార్యములను, అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనుపరచెదను. యెహోవాయొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును.” “సూర్యచంద్రులు తేజోహీనులైరి; నక్షత్రముల కాంతి తప్పిపోయెను.”
11 అపొస్తలుల కార్యములు 2:1-4, 14-21లో మనం చదువునట్లు, సా.శ. 33 పెంతెకొస్తునాడు దేవుడు 120 మంది స్త్రీపురుషులైన శిష్యులపై పరిశుద్ధాత్మ కుమ్మరించాడు. అపొస్తలుడైన పేతురు యిది యోవేలు ప్రవచించిన ప్రకారం జరిగిందని తెలియజేశాడు. అయితే సూర్యచంద్రులు తేజోహీనులు కావడం, నక్షత్రాలు వెలుగివ్వకపోవడాన్ని గూర్చి ఆయన ఉల్లేఖించి చెప్పిన భాగం విషయమేమిటి? ఇది సా.శ. 33లో లేదా 30 సంవత్సరాలకు పైగానున్న యూదా మత విధానాంత సమయంలో నెరవేరినట్లు ఏదియు సూచించుట లేదు.
12, 13. యోవేలు ప్రవచించిన అంతరిక్ష సంభ్రమాశ్చర్య సంఘటనలు ఎలా నెరవేరాయి?
12 స్పష్టంగా యోవేలు ప్రవచనమందలి ఆ భాగం “యెహోవాయొక్క భయంకరమైన ఆ మహాదినానికి” అనగా యెరూషలేము నాశనానికి దగ్గరి సంబంధమును కలిగియుండెను. ది వాచ్టవర్ నవంబరు 15, 1966, సా.శ. 70లో యెరూషలేముకు సంభవించిన శ్రమనుగూర్చి యిలా చెప్పింది: “అది నిశ్చయముగా యెరూషలేముకు, దాని పిల్లలకు సంబంధించిన ‘యెహోవా దినమే.’ ఆ దినాన విస్తారమైన ‘రక్తం, అగ్ని, ధూమం’ కనబడెను, పగటిపూట సూర్యుడు తేజోహీనుడు అయ్యాడు, చిందింపబడిన రక్తాన్ని సూచిస్తూ రాత్రియందు చంద్రుడు చల్లనికాంతిని, వెండివెన్నెలను విరజిమ్మలేదు.”c
13 అవును, మనం గమనించిన యితర ప్రవచనాల వలెనే, యెహోవా తీర్పుతీర్చినప్పుడు యోవేలు ప్రవచించిన అంతరిక్ష సంభ్రమాశ్చర్య సంఘటనలు నెరవేరాయి. యూదా మత విధానాంతపు కాలమంతటికి విస్తరించడానికి బదులు, సంహారక సైన్యాలు యెరూషలేముపై విరుచుకుపడినప్పుడు సూర్యచంద్ర, నక్షత్రాలు తేజోవిహీనమయ్యాయి. కాబట్టి, ప్రస్తుత విధానం మీదికి యెహోవా తీర్పు వచ్చినప్పుడు యోవేలు ప్రవచనంలోని ఆ భాగానికి మరిగొప్ప నెరవేర్పు ఉంటుందని మనం ఎదురుచూడవచ్చు.
అంతరిక్ష సంభ్రమాశ్చర్య సంఘటనలకు ముందు ఏ శ్రమ కలుగుతుంది?
14, 15. మత్తయి 24:29ని మనం అర్థంచేసుకోవడంలో యోవేలు ప్రవచనం ఏ ప్రభావాన్ని చూపుతుంది?
14 మొదటి శతాబ్దంలో (అదే విధమైన భాషను ఉపయోగించిన యితర ప్రవచనాల కనుగుణంగా) యోవేలు ప్రవచన నెరవేర్పు, మత్తయి 24:29 నందలి విషయాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతోంది. సూర్యచంద్రులకు చీకటి కమ్ముతుందని, నక్షత్రాలు రాలిపోతాయని యేసు మాట్లాడిన విషయం ప్రస్తుత విధానాంతానికి ముందు అనేక దశాబ్దాలలో ప్రయోగించబడు రోదసీ రాకెట్లు, చంద్రునిపై కాలుమోపడం వంటి సంగతులను సూచించడం లేదు. అయితే, “యెహోవాయొక్క భయంకరమైన ఆ మహాదినమునకు” అంటే రాబోయే నాశనానికి ముడిపడిన సంఘటనలను ఆయన సూచిస్తున్నాడు.
15 ఆ అంతరిక్ష సంభ్రమాశ్చర్య సంఘటనలు “శ్రమ ముగిసిన వెంటనే” ఎలా వస్తాయో మరి శ్రేష్ఠంగా అర్థం చేసుకోవడానికి మనకిది సహాయం చేస్తుంది. సా.శ. 70లో ముగిసిన శ్రమను యేసు సూచించడం లేదు. బదులుగా భవిష్యత్తులో, ఆయన వాగ్దత్త ప్రత్యక్షత ముగింపునందు ఈ లోక విధానంపై విరుచుకుపడే మహాశ్రమల ఆరంభాన్ని గూర్చి సూచిస్తున్నాడు. (మత్తయి 24:3) ఆ శ్రమ మన ముందున్న భవిష్యత్తులో జరుగుతుంది.
16. ఏ శ్రమను గూర్చి మార్కు 13:24 సూచిస్తోంది, మరి ఎందుకు?
16 “ఆ దినములలో ఆ శ్రమతీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు” అని మార్కు 13:24లో వ్రాయబడిన మాటల విషయమేంటి? ఇక్కడ “ఆ,” “ఆ” అనే ఈ రెండు అక్షరాలు గ్రీకు పదమైన ఎకైనోస్కు చేసిన అనువాదాలు. ఇది కాల వ్యవధిని సూచించే ప్రదర్శక సర్వనామం. ఎకైనోస్ అనే పదాన్ని, ఎప్పుడో జరిగిన గతకాల సంఘటనను (లేదా యింతకుముందు ప్రస్తావించిన) దానిని లేదా దాన్ని సుదూర బావిసంఘటనను సూచించడానికి ఉపయోగించవచ్చు. (మత్తయి 3:1; 7:22; 10:19; 24:38; మార్కు 13:11 17, 32; 14:25; లూకా 10:12; 2 థెస్సలొనీకయులు 1:10) ఆ విధంగా, మార్కు 13:24 “ఆ శ్రమ” అని చెప్పినప్పుడు, అది రోమన్లు కలిగించిన శ్రమను గూర్చి కాదుగాని, ప్రస్తుత విధానాంతమున యెహోవా తీసుకునే బలమైన చర్యను సూచించింది.
17, 18. మహా శ్రమలు ఎలా పురోగమిస్తాయి అన్న విషయంపైన ప్రకటన ఏ వెలుగును వెదజల్లుతుంది?
17 మత్తయి 24:29-31, మార్కు 13:24-27, లూకా 21:25-28 వచనాల అవగాహనకు ప్రకటనలోని 17 నుండి 19 అధ్యాయాలు అనువుగా ఉండి, ధృవపరుస్తున్నాయి. ఏ విధంగా? మహాశ్రమ ఒక్కసారిగా విరుచుకుపడి ముగిసిపోదు, అది ఆరంభమైనప్పుడు “మనుష్య కుమారుని సూచన” చూచుటకు మానవజాతిలోని కొందరు యింకా జీవించే ఉంటారని, “లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి, మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యము చెడి కూలుదురని” లూకా 21:26 చెప్పినట్లు వారు విలపిస్తారని సువార్తలు చూపిస్తున్నాయి. వారికి కలుగబోవు నాశనాన్ని తెల్పే “సూచనను” వారు చూసినందువల్ల వారు భయకంపితులౌతున్నారు.
18 భవిష్యత్తులో అంతర్జాతీయ “క్రూరమృగం” యొక్క సైనిక “కొమ్ములు,” “మహావేశ్యయగు” మహాబబులోనుపై విరుచుకుపడినప్పుడు మహాశ్రమలు ఆరంభమౌతాయని ప్రకటన వృత్తాంతం చూపిస్తోంది.d (ప్రకటన 17:1, 10-16) అయితే అనేకమంది ప్రజలు యింకావుంటారు, ఎందుకంటే రాజులు, వ్యాపారులు, నావికులు, యితరులు అబద్ధమత అంతాన్ని గూర్చి విలపిస్తారు.—ప్రకటన 18:9-19.
ఏమి జరుగనైయుంది?
19. మహా శ్రమలు ప్రారంభమైనప్పుడు మనం దేని కొరకు ఎదురుచూడవచ్చు?
19 ప్రకటన 17 నుండి 19 అధ్యాయాలతో కలుపుకుని మత్తయి, మార్కు, లూకా సువార్తల్లోని వృత్తాంతాలు త్వరలో సంభవించే దాన్ని స్పష్టపరుస్తున్నాయి. దేవుని నిర్ణయకాలంలో, ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యంపై (మహాబబులోను) దాడితో మహాశ్రమలు ప్రారంభమౌతాయి. ప్రత్యేకంగా యిది అవిశ్వాస యెరూషలేముకు సారూప్యంగావున్న క్రైస్తవమత సామ్రాజ్యంపై తీవ్రంగా ఉంటుంది. శ్రమలోని ఈ భాగం “ముగిసిన వెంటనే,” “సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలును, భూమిమీద . . . కలవరపడిన జనములకు శ్రమయు కలుగును.”—మత్తయి 24:29, లూకా 21:25.
20. ఏ అంతరిక్ష సంభ్రమాశ్చర్య సంఘటనల కొరకు మనం ఎదురు చూడగలం?
20 ‘సూర్యున్ని చీకటి కమ్మును, చంద్రుడు వెలుగివ్వడు, నక్షత్రాలు ఆకాశంనుండి రాలిపోతాయి, ఆకాశమందలి శక్తులు కదిలింపబడతాయి’ అంటే దాని భావమేంటి? నిస్సందేహంగా, ప్రకటన 17:16లో చెప్పబడిన “పదికొమ్ములు,” మహాశ్రమల తొలి భాగంలో అనేక “జ్యోతులను” అనగా, ప్రముఖ మతనాయకులను బయల్పరచి, హతమారుస్తాయి. రాజకీయ శక్తులు కూడా కదిలింపబడతాయనడంలో సందేహం లేదు. ఆకాశంలో కూడా భయానక సంఘటనలేవైనా సంభవిస్తాయా? యూదామత విధానాంత సమీపకాలంలో జరిగినవని జోసిఫస్ వర్ణించిన వాటికంటే మరి భీకరమైన సంఘటనలు నిశ్చయంగా జరుగవచ్చును. ప్రాచీన కాలంలో అటువంటి విపత్కర సంఘటనల్ని కలుగజేయడానికి దేవుడు తనశక్తిని ప్రదర్శించాడని మనకు తెలుసు, మరి యిప్పుడు కూడా అలా చేయగలడు.—నిర్గమకాండము 10:21-23; యెహోషువ 10:12-14; న్యాయాధిపతులు 5:20; లూకా 23:44, 45.
21. భవిష్యత్ “సూచన” ఎలా సంభవిస్తుంది?
21 ఆ తర్వాత జరుగు సంఘటనను ప్రస్తావిస్తూ ముగ్గురు సువార్త రచయితలు టొటె (అప్పుడు) అనే గ్రీకు పదాన్ని ఉపయోగిస్తున్నారు. “అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును.” (మత్తయి 24:30; మార్కు 13:26; లూకా 21:27) అనేకమంది ప్రజలు గుర్తించకపోయినప్పటికి, మొదటి ప్రపంచ యుద్ధకాలం నుండి యేసు నిజ శిష్యులు ఆయన అదృశ్య ప్రత్యక్షత యొక్క సంయుక్త సూచనను గ్రహించారు. అయితే “మనుష్యకుమారునికి” సంబంధించిన మరో “సూచన” కనబడుతుందని మత్తయి 24:30 సూచిస్తుంది, గనుక దీన్ని గ్రహించడానికి జనాంగాలన్నీ వత్తిడి చేయబడతాయి. యేసు అదృశ్యముగా “మేఘారూఢుడై” వచ్చినప్పుడు, ఆయన మానవాతీతమైన రాజ్యాధికారమును ప్రదర్శిస్తాడు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకించే ప్రజలు ఆ “రాకడను” (గ్రీకు, ఎర్కోమినోన్) గుర్తించాల్సి ఉంటుంది.—ప్రకటన 1:7.
22. మత్తయి 24:30లో “సూచన”ను చూడడం ఏ ప్రభావాన్ని కల్గివుంటుంది?
22 తర్వాత వచ్చేదానిని పరిచయం చేయడానికి మత్తయి 24:30 మరోసారి టొటె అనే పదాన్ని ఉపయోగిస్తోంది. తమకు కలిగే పరిణామాల్ని ముందే గ్రహించి తమకు నాశనం ముంచుకొస్తుందని వారు గుర్తిస్తారు గనుక జనాంగాలు రొమ్ముకొట్టుకుంటూ విలపిస్తారు. తమ విడుదల సమీపమైందని తెలుసుకొని ధైర్యంగా తమ తలలెత్తుకునే దేవుని సేవకులకూ వీరికి ఎంత భేదం! (లూకా 21:28) మహావేశ్య అంతాన్ని గూర్చి భూమ్యాకాశములందలి నిజమైన ఆరాధికులందరు ఆనందిస్తారని కూడ ప్రకటన 19:1-6 చూపిస్తోంది.
23. (ఎ) ఎన్నుకున్న వారి యెడల యేసు ఏ చర్యను గైకొంటాడు? (బి) శేషించబడినవారు పరలోకానికి కొనిపోబడతారన్న దాన్ని గూర్చి ఏమి చెప్పవచ్చు?
23 మార్కు 13:27లో చెప్పబడినట్లు యేసు చెప్పిన ప్రవచనము యింకా యిలా కొనసాగుతోంది: “అప్పుడాయన [టొటె] తన దూతలను పంపి, భూమ్యంతము మొదలుకొని ఆకాశాంతమువరకు నలుదిక్కులనుండి తాను ఏర్పరచుకొనిన వారిని పోగుచేయించును.” యేసు యిక్కడ భూమిపై యింకా జీవిస్తున్న 1,44,000 మంది “ఏర్పరచుకొనిన” శేషముపై దృష్టి నిల్పుతున్నాడు. యుగాంతమందలి తొలి భాగంలో, యేసు యొక్క ఈ అభిషక్త శిష్యులు దైవపరిపాలనా ఐక్యతలోనికి తీసుకురాబడ్డారు. అయితే, చెప్పబడిన క్రమపద్ధతి ప్రకారం మార్కు 13:27, మత్తయి 24:31 నందు మరికొంత వర్ణింపబడింది. “గొప్పబూరతో” “ఏర్పరచబడినవారి” శేషము భూమ్యంతమునుండి పోగుచేయబడతారు. ఎలా పోగుచేయబడతారు? నిస్సందేహంగా వారు “ముద్రించబడి” “పిలువబడిన . . . , యేర్పరచబడిన . . . , నమ్మకమైన” వారిలో భాగంగా యెహోవాచే స్పష్టంగా గుర్తించబడినవారిలో భాగమై ఉంటారు. దేవుని నిర్ణయకాలమున, వారు పరలోకంలో రాజులుగా, యాజకులుగా పోగుచేయబడతారు.e ఇది వారి నమ్మకమైన సహవాసులైన “గొప్పసమూహము” వారికి సహితం ఆనందాన్నిచ్చును. వారు పరదైసు భూమిపై నిత్యాశీర్వాదాలను అనుభవించడానికి “మహాశ్రమలనుండి” తప్పించుకొని రావడానికి గుర్తువేయబడ్డారు.—మత్తయి 24:22; ప్రకటన 7:3, 4, 9-17; 17:14; 20:6; యెహెజ్కేలు 9:4, 6.
24. రాబోవు సంఘటనల క్రమం విషయమై మత్తయి 24:29-31 ఏమి బయల్పరుస్తుంది?
24 “మాతో చెప్పుమని” అపొస్తలులు అడిగినప్పుడు, యేసు యిచ్చిన సమాధానములో వారు గ్రహించగల దానికంటే ఎక్కువ సమాచారం ఉంది. అయినా వారి జీవితకాలంలోనే ఆయన ప్రవచనం తమయెదుట నెరవేరడాన్ని చూసి ఆనందించారు. ఆయనిచ్చిన జవాబును గూర్చి మన పఠనం, ఆయన ప్రవచనం యొక్క భవిష్యత్ నెరవేర్పుపై దృష్టినిల్పింది. (మత్తయి 24:29-31; మార్కు 13:24-27; లూకా 21:25-28) మన విడుదల సమీపమైనదనే విషయాన్ని మనమిప్పటికే చూడగలం. మహాశ్రమల ఆరంభాన్ని, ఆ పిమ్మట మనుష్యకుమారుని సూచనను, ఆ తర్వాత దేవుడేర్పరచుకొనినవారు పోగుచేయబడుటను చూడడానికి మనం ఎదురుచూడవచ్చు. చివరకు, సింహాసనాసీనుడైన మన శూరుడైన రాజగు యేసు, అర్మగిద్దోనులో యెహోవా తీర్పరిగా “జయించుటకు బయలువెళ్లును.” (ప్రకటన 6:2) ఆయన పగతీర్చుకొనే ఆ యెహోవా దినము, 1914 నుండి ప్రభువైన యేసు దినముగా గుర్తించిన “యుగాంతము” మహత్వపూర్ణంగా ముగించబడుతుంది.
25. లూకా 21:28 నందున్న భవిష్యత్ నెరవేర్పులో మనం ఎలా భాగం వహించగలం?
25 “ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నది” అనే నెరవేరబోయే యేసు ప్రవచనానికి ప్రత్యుత్తరమివ్వడానికి, దైవిక బోధద్వారా మీరు ఎడతెగక ప్రయోజనం పొందాలి. (లూకా 21:28) యెహోవా తన పరిశుద్ధ నామాన్ని ప్రతిష్ఠించుకుంటుండగా ఏర్పరచుకొనిన వారికి, గొప్పసమూహానికి ఎంతటి దివ్యమైన భవిష్యత్తు ఎదురు చూస్తోందో కదా!
[అధస్సూచీలు]
a మన కాలంలోని భౌతిక విషయాలు బైబిలు ప్రవచనానికి తగ్గట్లు ఎలా నెరవేరుతున్నాయన్న దానికి రుజువును చూపడానికి యెహోవాసాక్షులు యిష్టపడతారు.
b వాచ్టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి వారు 1973లో ప్రచురించిన గాడ్స్ కింగ్డమ్ ఆఫ్ ఎ థౌజెండ్ యియర్స్ హేజ్ అప్రోచ్డ్ అనే పుస్తకంలోని 296-323 పేజీల్లోను, ది వాచ్టవర్ సెప్టెంబరు 15, 1982 నందు 17-22 పేజీల్లో అదనపు సమాచారం లభిస్తుంది.
c యెరూషలేముపై రోమా సైన్యం జరిపిన ప్రాథమిక దాడికి ఆ తర్వాత దాని నాశనానికి మధ్య కాలంలో జరిగిన విషయాలను గూర్చి యూదా చరిత్రకారుడైన జోసిఫస్ యిలా వ్రాశాడు: “రాత్రి సమయంలో విపత్కరమైన సుడిగాలి విసిరి, తుఫాను విరుచుకుపడింది, భూమి దద్దరిల్లుతూ భయంకరంగా కంపించింది, ఉరుములు మెరుపులతో ఎడతెరపి లేకుండ వర్షం కుండపోతగా కురిసింది. మొత్తం విధానం యిలా కుప్పకూలి పోవడం ద్వారా మానవజాతికి కలిగే విపత్తు స్పష్టంగా ఒక ముంగుర్తుగా చూపబడింది, ఆలాగే ఈ సూచనలన్ని రానైయున్న సాటిలేని వినాశనాన్ని గూర్చి తెలియజేశాయని ఎవరూ సందేహించలేరు.”
d “మహాశ్రమ,” “శ్రమ” అని యేసు చెప్పినదాని మొదటి అన్వయింపు యూదా మత విధాన నాశనాన్ని సూచించింది. అయితే మనదినానికి మాత్రమే అన్వయించే వచనాల్లో ఆయన (ఇంగ్లీషులో “ది ట్రిబ్యులేషన్” అనే “ది” అన్న) నిర్దిష్టపదాన్ని వాడాడు. (మత్తయి 24:21, 29; మార్కు 13:19, 24) ప్రకటన 7:14 ఈ భవిష్యత్ సంఘటనను “మహా శ్రమ,” అక్షరార్థంగా చెప్పాలంటే “గొప్పదైన శ్రమ” అని ఉపయోగించింది.
e ది వాచ్టవర్ ఆగస్టు 15 1990 సంచికలో వెలువడిన “పాఠకులనుండి ప్రశ్నలు” చూడండి.
మీకు జ్ఞాపకం ఉన్నాయా?
◻ యోవేలు 2:28-31, 3:15లోని విషయాలు మొదటి శతాబ్దంలో ఎలా నెరవేరాయి?
◻ మత్తయి 24:29 ఏ శ్రమను గూర్చి చెబుతుంది, మరి అలా మనం ఎందుకు చెప్పగలం?
◻ మత్తయి 24:29 ఏ అంతరిక్ష సంభ్రమాశ్చర్య సంఘటనలను సూచిస్తోంది, శ్రమ సంభవించిన వెంటనే అవి ఎలా జరుగుతాయి?
◻ లూకా 21:26, 28 భవిష్యత్తులో ఎలా నెరవేరుతుంది?
[16, 17వ పేజీలోని చిత్రం]
ఆలయ ప్రాంగణం
[క్రెడిట్ లైను]
Pictorial Archive (Near Eastern History) Est.