ప్రేతోర్య సేనలోని వాళ్లు సువార్త విన్నారు
అది సా.శ. 59వ సంవత్సరం. ప్రయాణ భారంతో అలసిపోయిన సైనికులు, వాళ్ల అదుపులో ఉన్న చాలామంది ఖైదీలు పోర్టా కాపేనా ద్వారం గుండా రోము నగరంలోకి ప్రవేశించారు. అక్కడున్న పాలన్టైన్ కొండ మీద నీరో చక్రవర్తి రాజభవనం ఉంది, ప్రేతోర్య సైనికులు దాన్ని 24 గంటలూ కాపలా కాస్తుంటారు.a ఆ సైనికులు తమ పైవస్త్రం కింద రహస్యంగా కత్తులు ఉంచుకునేవాళ్లు. శతాధిపతియైన యూలి తన అదుపులో ఉన్న ఖైదీలతో కలిసి రోమన్ ఫోరమ్ దాటి నడుచుకుంటూ విమినల్ కొండ ఎక్కాడు. వాళ్లంతా రోమా దేవుళ్ల బలిపీఠాలు ఉన్న తోటను దాటి, రోమా సైనికులు కవాతు నిర్వహించే మైదానం గుండా నడక సాగించారు.
సా.శ. 51కి చెందిన ఆర్చ్ ఆఫ్ క్లౌదియా మీదిదని భావిస్తున్న ప్రేతోర్య సైనికుల శిల్పం
ఆ బందీల్లో అపొస్తలుడైన పౌలు కూడా ఉన్నాడు. అప్పటికి కొన్ని నెలల క్రితం, ఆయన ఎక్కిన ఓడ తుఫాను ధాటికి బద్దలైన సందర్భంలో ఒక దేవదూత, “నీవు కైసరు ఎదుట నిలువవలసియున్నది” అని పౌలుకు చెప్పాడు. (అపొ. 27:24) మరి ఆ దేవదూత చెప్పినట్లు జరిగిందా? పౌలు రోము నగరంకేసి చూస్తున్నప్పుడు ఆయనకు యెరూషలేములోని అంటోనియా కోట దగ్గర యేసు చెప్పిన ఈ మాటలు తప్పక జ్ఞాపకం వచ్చి ఉంటాయి: “ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్నుగూర్చి నీవేలాగు సాక్ష్యమిచ్చితివో ఆలాగున రోమాలోకూడ సాక్ష్యమియ్యవలసియున్నది.”—అపొ. 23:10, 11.
బహుశా పౌలు అప్పుడు కాస్ట్రా ప్రైటోరీయా కోటవైపు ఒకసారి దృష్టి సారించివుంటాడు. ఎర్రటి ఇటుకలతో కట్టిన ఎత్తైన గోడలు, వాటిమీద దుర్గాలు, బురుజులు ఉన్న పెద్ద కోట అది. ఆ కోటలోనే చక్రవర్తి అంగరక్షకులైన ప్రేతోర్య సేన ఉండేది, అలాగే నగరంలో శాంతిభద్రతలను కాపాడే దళాలు కూడా ఉండేవి. సుమారు 12 వేలమంది ప్రేతోర్య సైనికులు, ఇతర సేనలు, అశ్వదళాలు అలా వేలమంది సైనికులు ఆ కోటలో ఉండేవాళ్లు. ఆ కోట రోమా సైనిక పాటవానికి నిదర్శనంగా ఉండేది. ఇతర ప్రాంతాల నుండి ఖైదీలను రోముకు తరలించే బాధ్యత కూడా ప్రేతోర్య సేనదే కాబట్టి, శతాధిపతియైన యూలి తన అధీనంలో ఉన్న బందీలను నాలుగు ప్రధాన ద్వారాల్లోని ఒక దాని గుండా రోము నగరానికి తీసుకువచ్చాడు. ఎన్నో ప్రమాదాలను తప్పించుకుంటూ కొన్ని నెలలపాటు ప్రయాణించి చివరికి ఆయన ఆ ఖైదీలను చేర్చాల్సిన చోటుకు చేర్చాడు.—అపొ. 27:1-3, 43, 44.
పౌలు ‘ఏ ఆటంకమూ లేకుండా’ ప్రకటించాడు
ఓడ బద్దలౌతుందని, ఆ ప్రమాదం నుండి అందులో ఉన్న వాళ్లందరూ బ్రతికి బయటపడతారని ప్రయాణంలో ఉండగా పౌలుకు దర్శనాల ద్వారా తెలిసింది. పాము కాటేసినప్పుడు కూడా ఆయనకు ఏమీ కాలేదు. పౌలు మెలితే ద్వీపంలో రోగులను బాగు చేసిన తర్వాత అక్కడున్న ప్రజలు ఆయనను ఒక దేవుడిలా చూశారు. మూఢనమ్మకాలను ఇట్టే నమ్మే ప్రేతోర్య సైనికులు కూడా ఈ విషయాల్ని బహుశా వినేవుంటారు.
అంతకుముందే పౌలు తనను చూడడానికి రోము నుండి ‘అప్పీయా సంతపేట వరకును, త్రిసత్రములవరకు వచ్చిన’ సహోదరులను కలిశాడు. (అపొ. 28:15) అయితే ఇప్పుడు రోములో ఖైదీగా ఉన్న పౌలు సువార్త ప్రకటించడం ఎలా కుదురుతుంది? (రోమా. 1:14, 15) ఖైదీలను సాధారణంగా సైనికుల నాయకునికి అప్పగించేవాళ్లని కొంతమంది నమ్ముతారు. అదే నిజమైతే గనుక, బహుశా పౌలును ఆఫ్రాన్యస్ బుర్రోస్ అనే ప్రేతోర్య నాయకునికి అప్పగించి ఉంటారు.b బహుశా ఆయన చక్రవర్తి తర్వాతి స్థానంలో ఉన్న అధికారి అయ్యుండవచ్చు. విషయం ఏదైనా, పౌలు శతాధిపతుల కావలిలో కాకుండా ఒక సాధారణ ప్రేతోర్య సైనికుని కాపలా క్రింద ఉన్నాడు. ఒక అద్దె ఇంటిలో ఉండేందుకు, సందర్శకుల్ని ఇంట్లోకి రానిచ్చేందుకు, ‘ఏ ఆటంకం లేకుండా’ వాళ్లకు ప్రకటించేందుకు పౌలుకు అనుమతి లభించింది.—అపొ. 28:16, 30, 31.
పౌలు అల్పులకు, ఘనులకు సాక్ష్యమిచ్చాడు
జైల్లో ఉన్న పౌలు, సంఘాలకు పంపించే పత్రికల్లో ఏమేమి రాయాలో చెబుతున్నప్పుడు సైనికులు విన్నారు
పౌలు విషయాన్ని నీరోకి నివేదించే ముందు న్యాయ విచారణలో భాగంగా బహుశా బుర్రోస్ పౌలును రాజభవనం వద్ద లేదా ప్రేతోర్య సేన జైలు వద్ద చాలా ప్రశ్నలు అడిగివుంటాడు. “అల్పులకును ఘనులకును సాక్ష్యమిచ్చే” ఈ అరుదైన అవకాశాన్ని పౌలు విడిచిపెట్టలేదు. (అపొ. 26:19-23) విచారణ తర్వాత బుర్రోస్ ఏ ముగింపుకు వచ్చాడో మనకు తెలియదు కానీ పౌలు మాత్రం ప్రేతోర్య సేన జైల్లో ఉండకుండా మినహాయింపు పొందాడు.c
పౌలు అద్దెకు తీసుకున్న ఇల్లు “యూదులలో ముఖ్యులైనవారిని” ఆహ్వానించడానికి, అలాగే “అతని బసలోనికి అతనియొద్దకు” వస్తున్న అనేకులకు సాక్ష్యమివ్వడానికి సరిపోయేంత పెద్దగా ఉండేది. ఇంకా ఆయన “ఉదయమునుండి సాయంకాలమువరకు” యూదులకు దేవుని రాజ్యం గురించి, యేసు గురించి ‘పూర్తిగా సాక్ష్యం’ ఇస్తుండగా ఆయనకు కాపలా ఉండే ప్రేతోర్య సైనికులు కూడా వినేవాళ్లు.—అపొ. 28:17, 23
ప్రస్తుతం కాస్ట్రా ప్రైటోరీయా కోట గోడలు ఇలా ఉన్నాయి
రాజ భవనం దగ్గర విధులు నిర్వహించే ప్రేతోర్య సైనికుల బృందం ప్రతీ ఎనిమిది గంటలకు ఒకసారి మారుతుంది. అలాగే పౌలుకు కాపలా కాసే సైనికులు కూడా క్రమంగా మారేవాళ్లు. అక్కడున్న రెండు సంవత్సరాల్లో పౌలు ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలస్సయులకు, హెబ్రీయులకు తన సహాయకుని చేత పత్రికలను రాయిస్తూ, వాటిలోని విషయాలను బయటకు చెబుతున్నప్పుడు సైనికులు విన్నారు. అలాగే ఆయన స్వయంగా ఫిలేమోనుకు ఉత్తరం రాయడాన్ని కూడా వాళ్లు చూశారు. యజమాని నుండి పారిపోయిన ఒనేసిము అనే దాసుని విషయంలో పౌలు ఎంత శ్రద్ధ వహించాడంటే, అతని గురించి చెబుతున్నప్పుడు, ‘నా బంధకములలో నేను కనిన నా కుమారుడు’ అని సంబోధించాడు. ఆ తర్వాత అతణ్ణి తన యజమాని దగ్గరికి తిరిగి పంపించాడు. (ఫిలే. 8-10) తనకు కాపలాగా ఉన్న సైనికుల మీద కూడా పౌలు ఎంతో శ్రద్ధ చూపించివుంటాడు. (1 కొరిం. 9:22) సైనికులు ధరించే కవచంలో ఉన్న వివిధ భాగాల గురించి ఆయన తనకు కాపలాగా ఉన్న సైనికుణ్ణి ప్రశ్నించడాన్ని, తర్వాత ఆ వివరాలను ఒక చక్కని ఉదాహరణలో ఉపయోగించడాన్ని మనం ఊహించుకోవచ్చు.—ఎఫె. 6:13-17.
‘నిర్భయంగా దేవుని వాక్యాన్ని బోధించండి’
పౌలు బందీగా ఉండడం ప్రేతోర్య సైనికుల మధ్య, మరితరుల మధ్య ‘సువార్త మరి యెక్కువగా ప్రబలమవ్వడానికి’ దోహదపడింది. (ఫిలి. 1:12, 13) కాస్ట్రా ప్రైటోరీయా కోటలో ఉన్న వాళ్లకు రోమా సామ్రాజ్యమంతటా, అలాగే చక్రవర్తితోనూ, విస్తారమైన ఆయన బంధుగణంతోనూ మంచి సంబంధాలు ఉండేవి. ఆ బంధుగణంలో కుటుంబ సభ్యులు, సేవకులు, బానిసలు ఉండేవాళ్లు, వాళ్లలో కొంతమంది క్రైస్తవులయ్యారు. (ఫిలి. 4:22) పౌలు నిబ్బరంగా సాక్ష్యం ఇవ్వడం వల్ల, రోమాలో ఉన్న సహోదరులు ‘నిర్భయంగా దేవుని వాక్యాన్ని బోధించడానికి’ కావాల్సిన ధైర్యాన్ని పొందారు.—ఫిలి. 1:14.
మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మనకు ఆయా సేవలు అందించడానికి మన దగ్గరికి వచ్చేవాళ్లకు సాక్ష్యమివ్వవచ్చు
మనం ‘సమయమందును అసమయమందును వాక్యాన్ని ప్రకటిస్తుండగా’ రోములో పౌలు చేసిన సాక్ష్యపు పని మనకు కూడా ప్రోత్సాహాన్నిస్తుంది. (2 తిమో. 4:2) మనలో కొంతమందికి ఇళ్లలో నుండి లేదా ఆసుపత్రుల్లో నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదు. కొంతమంది విశ్వాసం నిమిత్తం జైళ్లలో ఉన్నారు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మనల్ని చూడడానికి ఇంటికి వచ్చే వాళ్లకు లేదా మనకు కొన్ని రకాలైన సేవలను అందించడానికి వచ్చేవాళ్లకు మనం సాక్ష్యమివ్వవచ్చు. మనం ప్రతీ సందర్భంలో ధైర్యంగా సాక్ష్యం ఇవ్వడానికి ప్రయత్నిస్తే, ‘దేవుని వాక్యం బంధింపబడదు’ అనే విషయాన్ని మనం స్వయంగా చవిచూస్తాం.—2 తిమో. 2:8, 9.
a “నీరో కాలంలో ప్రేతోర్య సైనికుడు” అనే బాక్సు చూడండి.
b “సెక్స్టస్ ఆఫ్రాన్యస్ బుర్రోస్” అనే బాక్సు చూడండి.